గ్రామీణ క్రీడాకారుల సౌకర్యార్థం పల్లెకో క్రీడా మైదానం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలు, 226 అనుబంధ గ్రామాలను కలుపుకొని మొత్తం 784 క్రీడా మైదానాల ఏర్పాటుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. 560 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించగా, 494 గ్రామాల్లో పనులు సైతం చేపట్టారు. ఇందులో 435 ప్రాంగణాల నిర్మాణం పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చాయి. మరో 59 మైదానాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా 211 గ్రామాల్లో స్థలాలు గుర్తించాల్సి ఉన్నది. ఎకరంలోపు స్థలంలో వాలీబాల్, ఖోఖో కోర్టులు, సింగిల్ బార్, డబుల్ బార్, లాంగ్జంప్ తదితర ఆటలకు సంబంధించి సకల సౌకర్యాలను కల్పిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలు నిర్మించడంపై హర్షం వ్యక్తమవుతున్నది.
షాబాద్, మార్చి 1 : పల్లెపల్లెకు క్రీడాప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో గ్రామాల్లో సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు. వివిధ క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వెలుగులోకి రాలేకపోతున్నారు. ఇలా మరుగున పడిపోతున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడామైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 558 గ్రామపంచాయతీలు, 226 అనుబంధ గ్రామాల్లో కలిపి మొత్తం 784 క్రీడాప్రాంగణాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో 560 గ్రామాల్లో అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఇందులో 494 గ్రామాల్లో పనులు ప్రారంభించారు. ఇప్పటికే 435 ప్రాంగణాల నిర్మాణం పూర్తవడంతో అందుబాటులోకి వచ్చాయి. మరో 59 క్రీడా మైదానాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 211 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మారుమూల పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వస్తుండడంతో గ్రామీణ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెపల్లెన ప్రభుత్వ హరితహారం, పల్లెప్రకృతివనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. దీంతోపాటు యువకులు క్రీడలు ఆడుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఎకరం లేదా అంతకంటే తక్కువగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, క్రీడా ప్రాంగణాల నిర్మాణ పనులను చేపడుతున్నది. ప్రతి గ్రౌండ్లో వాలీబాల్, ఖోఖో కోర్టులు, సింగిల్ బార్, డబుల్ బార్తోపాటు, లాంగ్ జంప్ తదితర ఆటలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో ఏ గ్రామ యువత.. అదే గ్రామంలో వివిధ క్రీడలు ఆడుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడాకారులు చెబుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన క్రీడాప్రాంగణాలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.
క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయడం సంతోషకరం : కొలన్ శ్రీకాంత్రెడ్డి, చందనవెళ్లి(షాబాద్)
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గతంలో క్రీడా మైదానాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడేవాళ్లం. ప్రస్తుతం ప్రతి గ్రామంలో ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, క్రీడా సామగ్రి అందుబాటులో ఉంచడం గొప్ప పరిణామం.
ప్రభాకర్, డీఆర్డీవో, రంగారెడ్డిజిల్లా
జిల్లావ్యాప్తంగా 558 గ్రామపంచాయతీల్లో 784 తెలంగాణ క్రీడ ప్రాంగణాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 560 గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించగా.. 494 గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యాయి. అందులో ఇప్పటికే 435 గ్రామాల్లో క్రీడాప్రాంగణాల నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగతా వాటిలో కూడా పనులు జరుగుతున్నాయి. త్వరలో అవి కూడా పూర్తి చేసి అన్ని గ్రామాల్లో మైదానాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.