రంగారెడ్డి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా స్థాయి సంఘ సమావేశాలు సోమ, మంగళవారాల్లో జిల్లా పురోభివృద్ధిని కాంక్షిస్తూ విజయవంతంగా జరిగాయి. మొదటి రోజైన సోమవారం ‘వ్యవసాయం, స్త్రీ-శిశు, సాంఘిక సంక్షేమం’లపై సమీక్ష జరుగగా, మంగళవారం ‘ప్రణాళికలు, అభివృద్ధి పనులు – ఆర్థిక వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి, విద్య – వైద్యం, విద్యుత్, రహదారులు, నీటి పారుదల, మిషన్ భగీరథ’ లాంటి పనులపై సమీక్షలు జరిగాయి. జిల్లా భవిష్యత్తును కాంక్షిస్తూ చేపట్టబోయే అభివృద్ధిని గురించి పలువురు జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ‘రోడ్లు, భవనాలు, వ్యవసాయం, నీటి పారుదల, మిషన్ భగీరథ’ లాంటి ప్రజలకు నిత్యం అవసరమయ్యే పనులపై సమీక్షించారు. ప్రజాప్రతినిధులు ఏకరువు పెట్టిన సమస్యలపై చైర్పర్సన్ అధికారులతో మాట్లాడారు. ప్రజలకు, వారి అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న పలు సమస్యలపై అధికారులతో మాట్లాడి త్వరితగతిన వాటిని అమలులోకి తెచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
మహిళా సంఘాలకు ప్రోత్సాహం ఇవ్వండి..
రూర్బన్ ఫండ్స్ ఎక్కడ కేటాయించారు? వాటి వివరాలు తెలిపి ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కోటి రూపాయల రుణం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకాన్ని మహిళా సంఘాలు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మహిళా సంఘాలు స్టార్టప్ బిజినెస్లు పెట్టుకునేలా ప్రోత్సహించాలని గ్రామీణాభివృద్ధి అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం ఎన్ని మహిళా సంఘాలు స్టార్టప్ బిజినెస్లు పెట్టారు? వారి లాభ నష్టాలపై నివేదిక ఇవ్వాలని, బెల్ట్ షాపులన్నీ మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాకు కొత్తగా 9 పీహెచ్సీ కేంద్రాలు
జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటివరకు ఆరు మోకాలు ఆపరేషన్లు జరిగాయని.. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి నెలా 30 సర్జరీలు జరుగుతున్నాయని డాక్టర్ అనితారెడ్డి పేర్కొన్నారు. జిల్లాకు కొత్తగా 9 పీహెచ్సీ సబ్ సెంటర్లు మంజూరయ్యాయని తెలిపారు. గత రెండేండ్లలో లిటరసీ రేట్ ఎంత పెరిగిందో నివేదిక ఇవ్వాలని వయోజన విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల్లో ఆంగ్లంలో బేసిక్ నాలెడ్జ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సూచించారు. కేజీబీవీలో 5,400 మంది విద్యార్థులు చదువుతున్నారని.. త్వరలోనే కేజీబీవీ పాఠశాలలను సందర్శిస్తానని అధికారులకు తెలిపారు.
ఇంజనీరింగ్ శాఖల సమీక్షపై..
జిల్లాలో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పలు గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలున్నాయని.. వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి భూములను కాపాడాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలోసీఈవో దిలీప్కుమార్, డిప్యూటీ సీఈవో రంగారావు, జడ్పీటీసీలు, కో ఆప్షన్ సభ్యుడు పాల్గొన్నారు.
సమీక్ష సాగిందిలా..
* పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యక్రమాలపై..
* జిల్లా సాధారణ నిధుల నుంచి 16%, 4% పద్దు కింద ఖర్చు, వివరాలపై..
* గ్రామీణాభివృద్ధిలోని గనులు, భూగర్భ జల, గృహ నిర్మాణం, ఇంకా పలు అంశాలపై..
* రహదారులు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్, మిషన్ భగీరథలపై..
* వ్యవసాయంలో భాగంగా మార్కెట్ కమిటీ, పశు, ఉద్యాన వన, పట్టు, మత్స్య మొదలైన వాటిపై..
* స్త్రీ, శిశు సంక్షేమంలో భాగంగా దివ్యాంగుల కార్యక్రమాలపై..
* సాంఘిక సంక్షేమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్యకలాపాలపై..
* విద్య – వైద్యం విభాగంలో లోక్ శిక్షా సమితి, వైద్య ఆరోగ్య శాఖ, విధాన పరిషత్ కార్యక్రమాలపై..