కేశంపేట : గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో తనను పూజ చేయకుండా చేసి అవమానించారని మనస్థాపంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కేశంపేట మండలం దత్తాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామ సర్పంచ్ మామిడిపల్లి అలివేలు తన భర్త నర్సింహాతో కలిసి దుర్గామాత మంటపం వద్దకు వెళ్లింది. అప్పటికే మంటపం వద్ద సర్పంచ్ అలివేలుకు వరుసకు బావ అయ్యే యాదయ్య అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గామాతకు పూజలు చేయడానికి వచ్చాడు. దుర్గామాత వద్ద సర్పంచ్ అలివేలు దంపతులు ఎలా పూజలు చేస్తారని వారించి, దుర్బాషలాడినట్లు గ్రామస్తులు తెలిపారు.
పూజలను అడ్డుకోవడంతో మనస్థాపానికి గురైన అలివేలు రాత్రి ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేశంపేట ఎంపీఓ శ్రీనివాస్ చికిత్స పొందుతున్న సర్పంచ్ను పరామర్శించారు. యాదయ్య అనే వ్యక్తి తనను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న కారణంగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సర్పంచ్ అలివేలు ఎంపీఓ వివరించారు. ఈ సంఘటనపై సర్పంచ్ భర్త నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.