మొయినాబాద్ : ప్రధాన విద్యుత్ కనెక్షన్ విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సంఘటన మండల పరిధిలోని సురంగల్ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన చోటుచేసుకుంది. సురంగల్ గ్రామం పెద్ద చెరువు వద్ద గ్రామానికి వచ్చే ప్రధాన విద్యుత్ లైన్ విద్యుత్ స్తంభాన్ని గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. విద్యుత్ స్తంభం రెండు ముక్కలైంది. దీంతో గ్రామానికి కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే సిబ్బంది అమ్డాపూర్ గ్రామం నుంచి సురంగల్ గ్రామానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు.
కాని విరిగిపోయిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్తంభం మాత్రం వేయలేదు. శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సిబ్బంది అటువైపు వెళ్లి చూసిన దాఖలాలు లేవు. కాని విద్యుత్ తీగలు నేల మీద పటడంతో రోడ్డు వెంబడి వెళ్లేవారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం సరైంది కాదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.