మంచాల : కస్తూర్బా గిరిజన బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. ఆదివారం మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బిక్షాటన చేస్తూ కాలం గడిపేవారు. వారిని చైల్డ్లైన్ వారు నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అమ్మాయిలను చంద్రాయన్గుట్ట ఎమ్వీ ఫౌండేషన్లో చేర్పించారు. ఈ ఫౌండేషన్ వారు రెండునెలల క్రితం మంచాల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గిరిజన బాలికల వసతి గృహంలో చేర్పించారు. సమ్రీన్ 9వ తరగతి, నుస్రత్ 8వ తరగతి చదువుతున్నారు. వారికి చదువుపై ఇష్టం లేకపోవడంతో శనివారం ఉదయం పాఠశాల ఆవరణలో ఆడుకుంటామని చెప్పి అక్కడి నుంచి పరార్ అయినట్టు అక్కడి సిబ్బంది చెప్పారు.
పాఠశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా విద్యార్థుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే మంచాల పోలీసులకు తెలియజేయాలని చెప్పారు.