ఇబ్రహీంపట్నం : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సమాజం సగౌరవంగా తలెత్తుకుని ముందుకెళ్తోందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే కారణమని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మన్నెగూడ సమీపంలోని వేదా కన్వెన్షన్హాల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కునేవారని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.
రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేఖించిన వారే నేడు లబ్ధిపొందుతున్నారని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా కొన్ని లక్షల మంది రైతులు లబ్ధిపొంది వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. గతంలో బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలు కట్టలేని పరిస్థితిలో రైతుల ఇళ్లను జప్తుచేసే వారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అలాంటి సంస్కృతిని పూర్తిగా పారదోలి రైతులకు పూర్తిగా భరోసానిచ్చే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అలాగే, రైతుబంధు తరహాలోనే దళితబంధు కూడా కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలు, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఉన్నాయన్నారు. తల్లి గర్భంలోకి శిశువు ప్రవేశించినప్పటి నుంచి ఆమె పెళ్లి అయ్యే వరకు పూర్తిగా ప్రభుత్వమే భరించే విధంగా కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెంది ముందుకెళ్లాలంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త తన సొంత పనిగా భావించి ముందుకెళ్లాలన్నారు. తాను అన్నధాతకు అండగా ఉండే శాఖకు తనను ముఖ్యమంత్రి కేటాయించడం తన పూర్వజన్మ సుక్రుతమని, ఈ శాఖ ద్వారా రైతులకు సేవచేసే భాగ్యం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేష్, ప్రశాంత్కుమార్రెడ్డి, సత్తువెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.