కొత్తూరు రూరల్ : రైతులు నేల యొక్క సారాన్ని గుర్తించి వ్యవసాయం చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొపెసర్ డాక్టర్ జయశ్రీ అన్నారు. ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో ప్రొఫెసర్ డాక్టర్ రాజేశ్వరి ఆధ్వర్యంలో భూసార పరీక్షల ఆవశ్యకత, ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ జయశ్రీ హాజరై నేల యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించాలంటే ముందుగా నేల స్వభావాన్ని తెలుసుకోవాలని, నేల ఆరోగ్యాన్ని కాపాడి ముందు తరాల వారికి మంచి భూములను అందించాలన్నారు.
ప్రతి ఐదేండ్లకు ఒకసారి భూసార పరీక్షలను తప్పకుండా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు క్విజ్ను ఏర్పాటు చేసి నేలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగి జవాబులు చెప్పిన రైతులకు బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ బ్యాగరి సత్తయ్య, ఉపసర్పంచ్ దయానందంగుప్తా, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, వార్డు సభ్యులు, కళాశాల ప్రొఫెసర్లు, రైతులు పాల్గొన్నారు.