మొయినాబాద్ : పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని సురంగల్ గ్రామానికి చెందిన బండారి రవి కుమారుడు బండారి వినయ్ ఆరోగ్యం కోసం ఎమ్మెల్యే మఖ్యమంత్రి సహాయనిధి కింద రూ. 4లక్షలు ఎల్ఓసీ పత్రాన్ని శుక్రవారం చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యం కోసం ఎంతో ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.
పేద ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన తరువాత వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించడంతో పాటు మెరుగైన వైద్యం పొందడానికి ముందస్తుగా ఎల్ఓసీ పత్రాన్ని మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందించడంతో పేద ప్రజలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మేడిపల్లి సర్పంచ్ ప్రవీణ్, ఎంపీటీసీ అంజయ్య పాల్గొన్నారు.