షాబాద్ : స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్.ఎస్.ఆర్-2022పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ సెప్టెంబర్ 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు.
ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేది నుంచి సరిచేసే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి 5న తుది జాబితా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. జనవరి 1, 2022 నాటిన 18 ఏండ్లు నిండిన యువతి యువకులు ఆన్లైన్ ద్వారా గాని, ఫారం-6 ద్వారా గాని ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం గావించాల్సిందిగా తెలిపారు.
వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు, సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్లు మార్పునకు వచ్చిన దరఖాస్తులు అన్ని పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, జడ్పీ సీఈవో దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.