మంచాల : భక్తుల శివనామ స్మరణతో బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయం మార్మోగింది. వర్షం కురుస్తున్నా కూడా స్వామిని దర్శిచుకునేందుకు భక్తులు వాహనాల్లో జాతరకు తరలి వాచ్చారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. బుగ్గ రామలింగేశ్వరస్వామి జాతరలో భాగంగా భక్తులు కార్తీక స్నానాలను ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకోని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో భక్తుల సత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించారు. మహిళలు తులసికోట, శివలింగం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న కబీర్దాస్, నాగన్నపుట్ట, నర్సింహ బాబా సమాదిని దర్శించుకున్నారు.
జాతరపై అధికారుల పర్యవేక్షణ..
బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉన్నారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మూడు రోజులుగా వర్షలు కురుస్తున్నందున పారిశుధ్య కార్మికులు దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా చెత్తా, చేదారం ఉండకుండా చూడడమే కాకుండా వైద్య సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు కులుగకుండా తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. మంచాల సీఐ వెంకటేశ్గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.