తుర్కయాంజల్ : కుటుంబం పరంగా ఎదురు అవుతున్న సమస్యలపై న్యాయం జరుగాలంటే వయో వృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ విస్మరించే సంతానానికి శిక్షలు తప్పవని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి అన్నారు. రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, తారామతిపేట వయోవృద్ధుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆమె మాట్లాడుతూ పిల్లల ద్వారా నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రుల హక్కులకు రక్షణ కల్పించేందుకే ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామన్నారు. వయోవృద్ధుల సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చిన వాటిన సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు.
నిరాక్షరాస్యులకు చట్టాలు తెలియక అక్షరాస్యులకు అవగాహన లేక వారి హక్కుల్ని కోల్పోతున్నారన్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలకు వారి యొక్క హక్కులు, ప్రయోజనాలు తెలిపేందుకు సుప్రీం కోర్టు, హైకోర్టు సంయుక్త ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్ మహోత్సవం పేరుతో అవగాహన సద్సులు ఏర్పాటు చేస్తుందన్నారు. ఆస్తులను పిల్లలకు పంపకాలు చేసిన తరువాత తల్లిదండ్రులను వారి పిల్లలు చూడనట్లైతే ఆర్డీఓ కోర్టు ద్వారా వాటిని రద్దు చేయించి తిరిగి తమ ఆస్తులను పొందవచ్చన్నారు. వయోవృద్ధులు తమ పేరుపై ఉన్న ఆస్తులను తాము బతికున్నంత కాలం తమ పేరుపైనే ఉంచుకోవాలని సూచించారు. కొడుకులు, కూతుర్లు, కోడల్ల వల్ల గృహహింసకు గురై వేదన పడుతున్న వృద్ధుల సంఘాల్లో సభ్యులుగా చేరితే వారి సంరక్షణ, పోషణ చూడని పిల్లలకు తగిన రీతిలో గుణపాఠం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆ సంఘం సావనీర్ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ మూల మహేష్గౌడ్, ఎంపీటీసీ చేగూరి వెంకటేశ్, వార్డు మెంబర్ మూల కిరణ్ కుమార్గౌడ్, రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ డిస్టీక్ వెల్ఫేర్ అధికారి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు మధుసూనద్రావు, ఉపాధ్యక్షుడు టి. విజయలక్ష్మి, మూల సత్యనారాయణగౌడ్, కార్యదర్శి ఆర్. నర్సయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి పాటి యాదిరెడ్డి, అబ్ధుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు బురదాస్ గౌడ్, తారామతిపేట గ్రామ గౌరవ అధ్యక్షుడు మూల యాదయ్య గౌడ్, అధ్యక్షుడు తాటిపర్తి నర్సింహా రెడ్డి, కార్యదర్శి సుదర్శన్, వయో వృద్ధులు పాల్గొన్నారు.