కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ బ్యాంకుల్లో కన్నా పీఏసీఎల్లో రైతులకు లోన్లు ఎక్కువగా ఇస్తారని చెప్పారు. అంతేకాకుండా వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల పీఎసీఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా బ్యాంకులు నడువలంటే డిపాజిట్లు ఉండలన్నారు. అందుకోసం ఎక్కువ మంది పీఏసీఎస్లో డబ్బులు డిపాజిట్ చేసేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ, వ్యాపార సంబంధిత లోన్లను తీసుకుని సకాలంలో చెల్లిస్తే బ్యాంకు మనుగడకు ఢోకా ఉండదన్నారు. ముఖ్యంగా రైతులకు గతంలో పంటకు పెట్టుబడి కావలంటే గగనంగా ఉండేదన్నారు. రైతుబంధుతో ఆ పరిస్థితులు పోయాయని చెప్పారు. ముఖ్యంగా రైతులు పంటమార్పిడి చేయాలన్నారు. లాభదాయకమైన పంటలనే వేయాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక మొత్తంలో లాభాలు వచ్చేలా వ్యవసాయాన్ని చేయాలని సూచించారు. ఆర్గానిక్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, ఎంపీటీసీ రాజు, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.