ఆదిబట్ల, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులనూ భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర సర్కార్ యోచిస్తున్నది. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)తో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు (పీటీఎం)నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నెలా మూడో శనివారం సమావేశం నిర్వహించేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల, విద్యార్థుల సమస్యలు, లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది.
పీటీఎం లక్ష్యాలు ఇవే..
పాఠశాలతో సమాజం, విద్యార్థుల తల్లిదండ్రులతో అనుసంధానానికి పీటీఎం దోహదం చేస్తుంది.ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణలో క్లాస్ టీచర్, తల్లిదండ్రులతో పీటీఎం నిర్వహించాలి.ప్రతి నెలా మూడో శనివారం సమావేశం.విద్యార్థుల హాజరు, ప్రవర్తన, చదువుపై చర్చ.పరీక్ష ఫలితాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలుసుకోవచ్చు.
పీటీఎంలో చర్చించే అంశాలు…
విద్యార్థుల చదువుతో పాటు ఆటపాటల్లో ప్రతిభను తెలుసుకోవచ్చు.
మన ఊరు-మన బడి, ఆంగ్ల మాధ్యమం అమలును తెలుసుకోవచ్చు.
పోటీ పరీక్షల్లో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు తయారు చేయడం.
సమావేశంలో చర్చించిన అంశాలను రికార్డ్ చేసి మినిట్స్ తయారు చేసి, ఎంఈవో, డీఈవోలకు పంపించాలి.పాఠశాలల్లో సమస్యలకు సత్వర పరిష్కారం లభించనున్నది.
అధికారుల బాధ్యతలు..
అధికారులు నిరంతరం పాఠశాలలను పర్యవేక్షిస్తూ తల్లిదండ్రుల సమావేశాలకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే విద్యా క్యాలెండర్లోని అంశాలను పీటీఎం సమావేశంలో తల్లిదండ్రులకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇబ్రహీంపట్నం మండలంలో 49 పాఠశాలల్లో సమావేశాలు..
ఇబ్రహీంపట్నం మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు. వీటన్నింటీలో ఎస్ఎంసీతో పాటు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది..
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చాలా బాగుంది. పేరెంట్స్ మీటింగ్తో విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవచ్చు. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని, ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు.
– మహేందర్, ఆదిబట్ల
అందరి భాగస్వామ్యం ఉండాలి..
పాఠశాలల్లో అందరి భాగస్వామ్యం ఉంటే పాఠశాల అభివృద్ధి చెందుతుంది. ఇబ్రహీంపట్నం మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలో పీటీఎం నిర్వహిస్తారు. మీటింగ్కు సంబంధించి మినిట్స్ బుక్ తప్పని సరి. వివరాలను సీఆర్పీల నుంచి ఎమ్మార్సీకి అందించాలి. మేము జిల్లా కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది.
– వెంకట్రెడ్డి, ఎంఈవో, ఇబ్రహీంపట్నం మండలం
ప్రతి నెలా పీటీఎం నిర్వహిస్తాం..
ప్రతి నెలా మూడో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తాం. సమావేశ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాం. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం అభినందనీయం.
– వీ పరమేశ్, ప్రధానోపాధ్యాయులు, ఆదిబట్ల