యాలాల సెప్టెంబర్ 2 : ముడి పట్టు తయారీకి పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. పట్టు ఉత్పత్తిలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉన్నది. తక్కువ సమయంలో అధిక లాభాలు వచ్చే పట్టు పురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. మల్బరీ సాగుకు షెడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నది. నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. సెరీకల్చర్, ఉద్యానవన అధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు.
కుటీర పరిశ్రమగా పట్టు పురుగుల పెంపకం..
కుటుంబ సభ్యులందరూ కలిసి పట్టుపురుగులను పెంచవచ్చు. వంద గుడ్ల ఖరీదు రూ.700 వాటిని తెచ్చుకొని నల్లబట్ట కప్పి కొన్ని సస్య రక్షణ చర్యలను చేపట్టడం వల్ల 10 రోజుల్లో 50 శాతం పిల్లలు బయటకు వస్తాయి. ఇది ఒక పద్దతి. రూ 3500 చెల్లించి 10 రోజుల 100 పిల్లలను పొందడం మరొక పద్ధతి. 10 రోజుల పిల్లలను చిన్న ట్రేలలో వేసి వాటిపై నైలాన్ తెర వేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగిన మల్బరీ ఆకును వాటిపై వేస్తారు. అలా పెరుగుతున్న పట్టు పురుగులు నాలుగో దశకు చేరుకోగానే గూళ్ల అల్లకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాటిని చంద్రికల లోకి మార్చుతారు. 5, 6 రోజుల్లో గూళ్లు తయారవుతాయి. వాటిని చంద్రికల నుంచి వేరు చేసి విక్రయిస్తారు.
ఆదర్శ రైతు రామచందర్..
చక్కని ఆదాయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రామచందర్. యాలాల మండలం కోకట్ గ్రామ పరిధిలో పట్టు పురుగుల పెంపకంలో ప్రత్యేకతను చాటుతున్నారు. తనకున్న కొద్దిపాటి భూమిలో మల్బరీ పెంచుకొని, షెడ్డును నిర్మించుకొని పట్టు పురుగుల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు.
ఉత్తమ మల్బరీ రకాలు..
వివిధ రకాలైన వ్యవసాయ వాతావరణ, మట్టి అనువర్తనాల కోసం విక్టరీ 1, ఎస్ 36, ఎస్ 13, ఎస్ 34, సహానా, ఆర్సీ 1, ఆర్సీ 2, ఆర్ 12, జీ 2, జీ 4 మొదలైన మల్బరీ రకాలను పెంచుకోవడం వల్ల అధిక పంటను పొందవచ్చు.
పెంపకానికి అవసరమైన గృహం..
200 నుంచి 250 డీఎఫ్ఎల్ఎస్కు ఆవాసం కల్పించడానికి 50X20X10 అడుగుల పెంపక గృహం అవసరం. మనం పెంచే సామర్థ్యాన్ని బట్టి పెంపక గృహాన్ని నిర్మించుకోవాలి. పెంపక గృహంలో ఉపయోగ పడే అతి ముఖ్యమైన పరికరాల్లో పవర్ స్ప్రేయర్, పెంపకం స్టాండ్స్, పెంపకం ట్రేలు, పోం ప్యాడ్లు, మైనం కోటింగ్ వేసిన పారాఫిన్ కాగితాలు, నైలాన్ తెరలు, ఆకులు ఉంచడానికి బుట్టలు, గోనె సంచులు, రోటరీ లేదా వెదురు మౌంటేజ్లు లేదా నెట్ట్రేక్లు ముఖ్యమైనవి.
ముందస్తు చర్యలు..
మల్బరీ సాగుకు బంక లేదా నల్ల మట్టి నేలలు, 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత, 1000 నుంచి 1500 మి.మీ వర్షపాతం అవసరమవుతుంది. మొక్క నాటే సమయంలో వరుసల మధ్య 20 సెం.మీ, అంట్ల మధ్య 8 సెం.మీ ఖాళీ తప్పనిసరి. నారు నాటడానికి ముందు టిక్కా తెగులు సోకకుండా 0.1శాతం డీడీవీపీని, బూడిద తెగులు సోకకుండా 0.1శాతం బావిస్టన్లను పిచికారీ చేయాలి. జూన్, జూలై నుంచి నవంబర్, డిసెంబర్ వరకు నర్సరీ పెంపకానికి అనువైన సమయం.
అధిక లాభాలకు సులువైన మార్గం..
రైతులు సులభంగా పెంచుకునే పంటల్లో పట్టు పురుగుల పెంపకం ఒకటి. ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నది. సబ్సిడీతో షెడ్డు, అరల నిర్మాణాలు చేసుకోవచ్చు. లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. మల్బరీ సాగుకు, షెడ్ నిర్మాణానికి జనరల్ కేటగిరీ వారికి 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం సబ్సిడీ అందజేస్తారు. – మల్లికార్జున్, ఏడీ, సెరికల్చర్