షాబాద్ : ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నెట్వర్క్ ఎంతో అవసరమని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఎయిర్టెల్, రిలయన్స్, జియో, టీఫైబర్ కార్పొరేషన్ ఏజెన్సీలతో సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి టెలికాం కమిటీ మొదటి సమావేశం అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నెట్వర్క్ ఎంతో అవసరమని, సెల్ టవర్స్ ఏర్పాటు వలన ప్రజలకు ఎటువంటి హాని జరుగదని, చెప్పే విషయంలో ప్రజలకు విశ్వాసం, నమ్మకం కల్గించాలని, అపోహలు తొలగించాలని సంబంధిత ఏజెన్సీలకు సూచించారు. టవర్స్ ఏర్పాటు చేసే సమయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ రోడ్లకు నష్టం జరుగకుండా చూడాలని, గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో నిబంధనల మేరకు టవర్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
టవర్స్ ఏర్పాటు సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి నెల 5వ తేదీలోపు నోడల్ అధికారి రాజేశ్వర్రెడ్డికి నివేదికలు పంపాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, జడ్పీ సీఈఓ దిలీప్కుమార్, డీపీవో శ్రీనివాస్రెడ్డి, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, ఇరిగేషన్ డీఈ సుజాత, మున్సిపల్ కమిషనర్లు అమరేందర్రెడ్డి, ఫాల్గుణ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ, ఆర్అండ్బీ డీఈ, అటవీ, పోలీసు, ట్రాన్స్కో అధికారులు, ఎయిర్టెల్, జీయో సంస్థల ప్రతినిధులు శివశంకర్రెడ్డి, రూపేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.