తుర్కయాంజల్ : సమిష్టి భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధిస్తుందని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ, తొరూర్, మునగనూర్, ఇంజాపూర్ గ్రామాల్లోని పలు వార్డుల్లో రూ. 2.85కోట్లతో చేపట్టనున్న యూజీడీ, సీసీరోడ్లు, శ్మశాన వాటికల ప్రహరి నిర్మాణం, స్టాం వాటర్ లైన్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్లతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సమిష్టి భాగస్వామ్యంతో పని చేసినప్పుడే మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా పని చేసినప్పుడే మున్సిపాలిటీ అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి తనవంతు సహాకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని గెలిచాక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలన్నారు. అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించకుండా వారితో స్నేహ భావంతో మెలిగి కౌన్సిలర్లు పనులు చేయించుకోవాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. దశల వారిగా అన్ని వార్డుల్లో సమాన అభివృద్ధి చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పించేందుకు పాలకవర్గం పార్టీలకు అతీతంగా పని చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి, ఆర్డీఓ వెంకటాచారి, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మశివకుమార్ తదితరులు పాల్గొన్నారు.