నందిగామ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నందిగామ మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు ఆదివారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్తో కలిసి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల గౌరవార్ధం బతుకమ్మ చీరలు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.
నియోజకవర్గంలోని లబ్ధిదారులందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో నందిగామ ఎంపీపీ ప్రియాంకగౌడ్, వైస్ ఎంపీపీ మంజుల, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, ఎంపీడీవో బాల్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.