ఇబ్రహీంపట్నం : పాలకవర్గం, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారానే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపల్కు అవార్డు వరించిన సందర్భంగా మంగళవారం విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిలను ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతిచందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితో పాటు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది సమన్వయంతోనే మున్సిపాలిటికి అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటిని మరింత అభివృద్ధి చేసేందుకు కంకణ బద్ధులై పని చేయాలన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి ద్వారానే ఇబ్రహీంపట్నంకు అవార్డు వరించిందన్నారు.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటికి వచ్చిన అవార్డును మంత్రితో పాటు ఎమ్మెల్యేకు పాలకవర్గం ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, కౌన్సిలర్ల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నీలం శ్వేతబాలు, కౌన్సిలర్లు నల్లబోలు మమత, బర్ల మంగ, కొండ్రు శ్రీలత రాంబాబు, కో-ఆప్షన్ మెంబర్లు గుంటి శంకుతల ఉన్నారు.