షాబాద్ : కొవిడ్ మూలంగా అనాథలైన పాక్షిక అనాథలైనా పిల్లలకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటున్నాయని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ, బాలల సంక్షేమ యూనిట్ రంగారెడ్డి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇటీవలి కాలంలో కొవిడ్ మూలంగా పాక్షిక అనాథలుగా మారిన 9 మంది పిల్లలకు వారి విద్యా అవసరాల కోసం అవసరమైన ఫీజు రూ. 2.50లక్షలు చెక్కులను గురువారం జిల్లా కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతానికి పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండాలన్న నేపథ్యంలో విద్యా విషయంలో ఎటువంటి ఆటంకాలు జరుగకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థిని, విద్యర్థులు వారి వారి చదువులు పూర్తి అయ్యే వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని రోటరి మేవరిక్స్ క్లబ్, పెప్ ప్రాజెక్ట్ నిర్వాహకులు చెప్పారు.
విద్యార్థులు మంచిగా చదువుకుని ప్రయోజకులు కావాలని వారు ఆకాంక్షించారు. తమకు సహాయ, సహకారాలు అందిస్తున్న అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు జీవితాంతం రుణపడి ఉంటామని విద్యార్థుల సంబంధికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్సీ కో-ఆర్డినేటర్ హర్షవర్దిని, జిల్లా బాలల సంక్షేమ అధికారి ప్రవీణ్కుమార్, రోటరి క్లబ్ మేవరిక్స్, పెప్ ప్రాజెక్ట్ నిర్వాహకులు సురేశ్కుమార్, శేఖర్, డీసీపీయూ ప్రతినిధులు చారి, సరస్వతి, అధికారులు పాల్గొన్నారు.