తుర్కయాంజాల్ : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ. 164కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజల్, పెద్దఅంబర్పేట, ఆదిబట్ల మున్సిపాలిటీలలో తాగునీరు రిజర్వాయర్ల నిర్మాణం, కాలనీల్లో తాగునీటి పైపులైన్ల ఏర్పాటుకు రూ. 164కోట్లు మంజూరైన నేపథ్యంలో ఎమ్మెల్యే సోమవారం తుర్కయాంజల్ మున్సిపాలిటీలో చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి, కౌన్సిలర్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో రూ. 38కోట్లతో ఇప్పటికే వాటర్ పైపులైన్లు, వాటర్ ట్యాంక్ల నిర్మాణం కొనసాగుతుందన్నారు.
మంజూరైన నిధులతో తుర్కయాంజల్ మున్సిపాలిటీలో రూ. 92 కోట్లతో 218కి.మీ మేర వాటర్ పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంక్(ఓహెచ్ఆర్)ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే పెద్దఅంబర్పేట మున్సిపాలిటిలో రూ. 54కోట్లతో 140కిలో మీటర్ల వాటర్ పైపులైన్లు, ఓవర్హెడ్ ట్యాంక్(ఓహెచ్ఆర్)ల నిర్మాణం, ఆదిబట్లలో రూ. 18కోట్లతో 36కిలో మీటర్ల చొప్పును వాటర్ పైపులైన్లు, ట్యాంక్ల నిర్మాణం చేపట్టనున్నారన్నారు. పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారం సీఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్, పెద్దఅంబర్పేటలో 4.00 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ల నిర్మాణం చేపడుతారన్నారు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్లో 30 సంవత్సరాల వరకు తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రణాళికబద్ధంగా మంజూరైన నిధులు వినియోగించాలని తెలిపారు.
మున్సిపాలిటీల్లో అభివృద్ధికి అడగగానే నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. 6 నెలల్లో వచ్చే సంవత్సరం జూన్ వరకు ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. రాగన్నగూడలోని లక్ష్మీ మెగా టౌన్షిఫ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 5.19కోట్లు విడుదలయ్యాయన్నారు. కాలనీల్లో డ్రైనేజీ, వాటర్ పైపులైన్లు వేశాకే సీసీ రోడ్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ అవుట్లెట్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఇదివరకే ఇస్తానన్న రూ. 3కోట్లతో పాటు మరో రూ. 3కోట్లు అదనంగా ఇవ్వాలని కౌన్సిలర్లు ఎమ్మెల్యేను కోరారు.
ముఖ్యంగా మాసాబ్ చెరువు కాలుష్యం భారిన పడకుండా నాదర్గుల్ నుంచి వచ్చే డ్రైనేజీని శుద్ధి చేసేందుకు చెరువు సమీపంలో ఎస్టీపీని, అలాగే రాగన్నగూడ కాలనీల నుంచి వచ్చే డ్రైనేజీ కోసం మరో ఎస్టీపీని ఏర్పాటు చేయాలని సభ్యులు ఎమ్మెల్యేకు విన్నవించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, సీజీఎం అమరేందర్, జీఎం శ్రీధర్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లు రమావత్ కళ్యాణ్ నాయక్, కొశిక ఐలయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.