షాబాద్ : రంగారెడ్డిజిల్లాను ప్లాస్టిక్ రహితజిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో నేర యువజన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ నెల 1వ తేది నుంచి 31వ తేది వరకు క్లీన్ ఇండియా కార్యక్రమం చేపట్టినందున ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిరోజు ఇంటింటికీ చెత్త సేకరణలో భాగంగా ప్లాస్టిక్ను సేకరించి రీసైక్లింగ్కు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ప్రజలకు ప్లాస్టిక్ ద్వారా కలిగే నష్టాలను వివరించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా అవగాహన కల్పించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు సూచించారు. అదే విధంగా కళాజాత బృందాలచే కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించా లని యువజన కేంద్ర అధికారికి సూచించారు. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త బండి ద్వారా కంపోస్టు యార్డుకు తరలించాలని చెప్పారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. క్లీన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో 700 కిలోల వరకు ప్లాస్టిక్ను సేకరించి రిసైక్లింగ్కు తరలించేలా చర్యలు తీసుకుంటామని యూత్ వెల్ఫేర్ అధికారి అదనపు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అదనపు పీడీ జంగారెడ్డి, జిల్లా యువజన శాఖ అధికారి ఇసయ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, డీఈవో సుసిందర్రావు, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.