షాబాద్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని చేవెళ్ల డివిజన్ ఐసీడీఏస్ సీడీపీవో శోభారాణి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జాతీయ బాలల వారోత్సవాల సందర్భంగా బేటి బచావో.. బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, రంగోలి, డ్రాయింగ్ తదితర పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చైల్డ్ హెల్ప్లైన్ సేవల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆడపిల్లకు 18ఏండ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలని, బాల్య వివాహాలు జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.
బాలికలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని తెలిపారు. అనంతరం రక్తహీనత కలిగిన బాలికలకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు తెలిపారు. బాలల హక్కుల గురించి క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఏస్ సూపర్వైజర్ రాజరాజేశ్వరి, పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు కడ్మూరి సుదర్శన్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.