ఇబ్రహీంపట్నంరూరల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించుకునేందుకు వీలుంటుందని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిర అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇబ్రహీంపట్నంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్జడ్జి ముదిగొండ రాజు, జూనియర్ సివిల్జడ్జి అనామికలు విద్యార్థులతో కలిసి కోర్టు నుంచి ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ తీశారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలన్నారు.
అనవసరమైన గొడవలకు పోయి తమ విలువైన సమయాన్ని వృథా చేసుకొవద్దన్నారు. అనవసరమైన గొడవలకు పోయి పోలీసుస్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను నష్టాల పాలు చేసుకోవద్దన్నారు. ఎలాంటి సమస్యలున్నా గ్రామాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు. రాజీమార్గానికి మించిన రాచమార్గం మరొక్కటి లేదన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాస్, వెంకటేష్, శ్రీనివాస్రెడ్డి, అంజన్రెడ్డి, రవి, మహేందర్,మురళీ, నాగరాజు తదితరులు ఉన్నారు.