షాబాద్ : వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా రుణవితరణ చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని చెప్పారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు.
వివిధ సంక్షేమ శాఖలకు చెందిన సబ్సిడీ రిలీజ్ అయిన యూనిట్లకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని, గ్రౌండింగ్ పూర్తి అయిన యూనిట్లకు యూటిలైజషన్ సర్టీఫికెట్ సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేసే సమయంలో అవసరమైనంత మేరకు ధ్రువపత్రాలను నిర్దేశించిన సమయంలో గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంస్వానిధి, పీఎంఈజీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించిన అన్ని పథకాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2022-23ను అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ప్రారంభించారు.
జిల్లాలో ఎంఎస్ఎంఈ, సోషల్ ఇన్ఫాస్ట్రక్చర్ రెన్యువల్ ఎనర్జీ, ఇతర రంగాలలో ఈ పొటెన్షియల్ ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రిజ్వాన్, ఆర్బీఐ ఎజిఎంఎమ్జెడ్ రహమాన్, నాబార్డు డీడీఎం శివశర్మ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.