రంగారెడ్డి జిల్లా అన్నింటా అగ్రగామిగా నిలుస్తున్నదని.. ఫార్మాసిటీ, ఫాక్స్కాన్ కంపెనీల ఏర్పాటుతో జిల్లా స్వరూపమే మారనున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదనయాత్ర ముగింపు సభ శనివారం పెద్దఅంబర్పేటలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉండి, మెరుగైన సేవలందించేవారే నిజమైన ప్రజాప్రతినిధులు అవుతారన్నారు. మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి కూడా ఇదే కోవకు చెందుతారన్నారు. పాదయాత్ర చేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం అభినందనీయమన్నారు. దీంతో ఆయన జనానికి మరింత దగ్గరయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే భూముల ధరలు పడిపోతాయని అనేక మంది ప్రచారం చేశారని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతోపాటు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. ఎలిమినేడులో ఏరోస్పేస్ కంపెనీ ఏర్పాటుకానున్నదని తెలిపారు.
-ఇబ్రహీంపట్నం, మార్చి 25
ఇబ్రహీంపట్నం, మార్చి 25 : ఫార్మాసిటీ ఫాక్స్కాన్ పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయని, వీటి ఏర్పాటు వల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ముగింపు సందర్భంగా పెద్దఅంబర్పేట అవుటర్రింగ్రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని అనేక మంది ప్రచారం చేశారని, రాష్ట్రం ఏర్పడ్డాక రంగారెడ్డి జిల్లా స్వరూపం పూర్తిగా మారిందన్నారు. జిల్లాకు పెద్ద ఎత్తున వస్తున్న అనేక పరిశ్రమల వల్ల భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పారు. జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్మాసిటీ యాచారం సమీపంలో ఏర్పాటవుతున్నందు వల్ల అనేక ఔషధ కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయని, వీటితో ఎంతోమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఫాక్స్ కాన్ పరిశ్రమ కూడా కొంగరకలాన్ సమీపంలో ఏర్పాటవుతున్నదని, దీనిద్వారా ఏటా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎమ్మెల్యే స్వగృహం ఎలిమినేడులోనూ ఏరోస్పోస్ కంపెనీ ఏర్పాటు కానున్నదని తెలిపారు.
ప్రజల కోసం పనిచేసేవారే నిజమైన ప్రతినిధి
ప్రతి రోజూ ప్రజల మధ్య ఉండి, వారి యోగక్షేమాలు తెలుసుకుని, వారికి సేవ చేసేవారే నిజమైన ప్రజాప్రతినిధి అని, మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి కూడా ఇదే కోవకు చెందుతారని మంత్రి కేటీఆర్ అభినందించారు. పాదయాత్రలు ప్రతిపక్షాలు చేస్తుంటాయని, ప్రభుత్వ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు చెబుతుంటారని, కానీ.. మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించడంతోపాటు వారి అవసరాలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టి ప్రజలకు మరింత దగ్గరయ్యారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు..
బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. కానీ, ప్రతిపక్షాలు కండ్లు లేని కబోదులుగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పట్నం మహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ సాయిచంద్, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ఎంపీపీలు కృపేశ్, నర్మద, జడ్పీటీసీ జంగమ్మ, మండల పార్టీ అధ్యక్షులు కొత్త కిషన్గౌడ్, రమేశ్గౌడ్, చీరాల రమేశ్, మున్సిపల్ అధ్యక్షుడు సిద్దెంకి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆకుల యాదగిరి, కోరె కళమ్మ జంగయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఏర్పుల చంద్రయ్య, సహకార సంఘం అధ్యక్షుడు లెక్కల విఠల్రెడ్డి, సుదర్శన్రెడ్డి, వెంకట్రెడ్డి, రాజేందర్రెడ్డి, మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కళ్లెం ప్రభాకర్రెడ్డి, అనంతుల వెంకటేశ్వర్రెడ్డి, పాశం దామోదర్, ఈదమ్మల బలరాం, భాస్కర్రెడ్డి, గోపాల్గౌడ్, కౌన్సిలర్లు విద్యారెడ్డి, రోహిణిరెడ్డి, పాశం అర్చన, హరిశంకర్, పరశురాం నాయక్, కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
గులాబీమయమైన పెద్దఅంబర్పేట
ప్రగతి నివేదన ముగింపు సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
ఇబ్రహీంపట్నం\పెద్దఅంబర్పేట, మార్చి 25 : ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యే తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ముగింపు సభతో పెద్దఅంబర్పేట గులాబీమయంగా మారింది. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతోపాటు పెద్దఅంబర్పేట, ఆదిబట్ల, తుర్కయాంజాల్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల నుంచి భారీ ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభకు తరలివచ్చారు.
అవుటర్ రింగురోడ్ సమీపంలోని విశాలమైన ప్రదేశంలో సభ ఏర్పాటు చేశారు. అవుటర్ రింగ్రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. మరోవైపు, బహిరంగ సభకు సుమారు 20 వేల మంది రావడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. ముఖ్యంగా బంటి యూత్ ఫోర్స్ సభ్యులు వలంటీర్లుగా సభకు హాజరైనవారికి అన్ని వసతులు కల్పించారు. బహిరంగ సభలో ప్రశాంత్కుమార్రెడ్డి మాట్లాడుతుండగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బహిరంగ సభకు గ్రామాల నుంచి హాజరైన వారికి ఒక్కో బస్సుకు ఒక్కో ఇన్చార్జిని నియమించి ప్రజలను తీసుకురావడంతోపాటు వారిని క్షేమంగా ఇండ్లకు చేర్చే బాధ్యతను కూడా వారికే అప్పగించారు.
ప్రగతి నివేదన ముగింపు బహిరంగ సభ హైలెట్స్
ఆదిబట్ల, మార్చి 25 : బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్ రెడ్డి (బంటి) చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర ముగింపు సభ విశేష స్పందన లభించింది.
ఎల్బీనగర్ చౌరస్తాలో ఎవరిని అడిగినా చెప్తారు.. మంత్రి సెటైర్లు
ఇబ్రహీంపట్నం, మార్చి 25: మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చరిత్ర తెలియంది కాదని, ఎల్బీనగర్ చౌరస్తాలోని అడ్డాలో ఎవరిని అడిగినా చెప్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వివిధ పార్టీల నుంచి పోటీచేస్తూ.. వరుసగా ఓడిపోతున్న రంగారెడ్డి మళ్లీ మరోసారి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారన్నారు. మూడు సార్లు ప్రజల చేతిలో చిత్తుగా ఓడిపోయిన రంగారెడ్డి.. ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. గతంలో మలక్పేట ఎమ్మెల్యేగా పని చేసిన రంగారెడ్డి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసి అనేక అక్రమాస్తులు కూడబెట్టారని విమర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఓ పిట్ట కథను చెప్పుకొచ్చారు.
‘పెద్దఅంబర్పేలో ఓ యువకుడు ఎప్పుడూ తాగుతుండేవాడు. ఓ సారి ఇంట్లో తండ్రి జేబులో డబ్బులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించిండు. తల్లి గమనించి అడ్డుకుని తప్పురా అని చెప్పింది. అది వినకుండా రోకలి బండతో కొట్టి తల్లిని చంపేశాడు. అది చూసి పరుగున వచ్చిన తండ్రి దారుణాన్ని అడ్డుకోబోయాడు. తండ్రిని సైతం చంపేశాడు. దీంతో పోలీసులు అరెస్టు చేసి, జడ్జి ముందు ప్రవేశపెట్టిండ్రు. అక్కడ మంచిరెడ్డి కిషన్రెడ్డి అసోంటి మంచి జడ్జి ఉండె. ఇదేం పనిరా బాబు, ఇంత ఘోరం ఎవరైనా చేస్తడా చెప్పు.. అని ప్రశ్నించి దీనికి ఏం శిక్ష వేయాల్నో నువ్వే చెప్పురా అని జడ్జి అడిగిండు. అప్పుడు ఆ తాగుబోతు యువకుడు తల్లిదండ్రులు లేని అనాథను నన్ను క్షమించండి అని అడిగిండంట’ ఇది మల్రెడ్డి రంగారెడ్డి తీరు అని హాస్యం పండించారు. ఈ ఎన్నికల్లోనూ మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు ఓటమి రుచి చూపిస్తారని అన్నారు.
ఆకట్టుకున్న ఆటపాటలు..
బహిరంగ సభలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన యాత్ర ధూంధాం సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాడిన పాటలకు సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా యువకులు కేరింతలతో నృత్యాలు చేశారు. సభకు వచ్చిన ప్రజలంతా ఉత్సాహంగా లేచి బీఆర్ఎస్ జెండాలు ఊపుతూ సందడి చేశారు. పండుగ వాతావరణం సృష్టించారు. ముఖ్యంగా బంటి యూత్ఫోర్స్ కోలాహలంగా నృత్యాలు చేసింది. జై బంటన్న జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. సభా వేదికపై నుంచి బంటి అని పేరు పలికిన ప్రతిసారి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సందడి చేశారు. మరోవైపు, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా మహిళలు సభా వేదిక వద్దకు వచ్చారు. బోనాలు నెత్తిన ఎత్తుకుని సభలో జనం మధ్య నుంచే వేదిక వైపు నడిచారు. బోనాలు అందరి దృష్టిని ఆకర్శించాయి. ధూంధాం కళాకారుల నృత్యాలకు అడుగులు కలిపారు.
ఎనిమిదేండ్లలో రూ.2,391 కోట్ల నిధులు : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఎనిమిదేండ్లలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూ.2,391 కోట్ల నిధులు మంజూరు కాగా, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. గతంలో విద్యుత్తు, తాగునీరు వంటి ప్రధాన సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారని, రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటలపాటు విద్యుత్తు సరఫరాతోపాటు ఇంటింటికీ తాగునీటి సరఫరా అవుతుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తాను తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ను కలిసి తాను పార్టీలో చేరుతానని చెప్పిన వెంటనే ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభకు విచ్చేసిన సీఎం కేసీఆర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి చేసి చూపించారన్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయించి, ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు భూముల రేట్లు పెరిగేందుకు దోహదపడ్డారన్నారు.
నిరుద్యోగంలో వెనుకబడిన మంచాల, యాచారం మండలాల్లో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి, ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఒక్కో మున్సిపాలిటీకి రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయించి, మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కొహెడ సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత పండ్ల మార్కెట్కు వెంటనే నిధులు కేటాయించి, పనులు వేగవంతం చేయాలన్నారు. మైనింగ్ జోన్ ఏర్పాటు వల్ల భూములు కోల్పోయిన బండరావిరాల, చిన్నరావిరాల రైతులకు వెంటనే పరిహారం ఇప్పించాలన్నారు. పెద్దఅంబర్పేట – పసుమాముల మధ్య రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయించాలని కోరారు. తట్టిఅన్నారంలోని హనుమాన్నగర్, జీవీఆర్ కాలనీల్లో మురుగునీటి సరఫరాకు ట్రంక్లైన్ కోసం రూ.3 కోట్లు కేటాయించాలని కోరారు.
పాదయాత్ర సాగిన తీరిది : 63 రోజులు.. 95 గ్రామాలు
పెద్దఅంబర్పేట/ అబ్దుల్లాపూర్మెట్/ ఆదిబట్ల, మార్చి 25: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి (బంటి) చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 63 రోజుల పాటు 95 గ్రామాల్లో కొనసాగింది. జనవరి 22న యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో ప్రారంభమైన ప్రగతి నివేదన యాత్ర శనివారం పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో ముగిసింది. పాదయాత్ర నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో 771 కిలోమీటర్లు సాగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రూ.2,391 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తిరిగి పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్స్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, దళితబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు ఎలా అందుతున్నాయనే దానిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో అత్యవసర సమస్యలను సైతం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. యాచారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పశు కళేబరాలను శుద్ధి చేసే పరిశ్రమ వల్ల సుమారు నాలుగు గ్రామాల ప్రజలు దుర్వాసన భరించలేక ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. పాదయాత్ర ద్వారా గ్రామానికి వెళ్లిన ప్రశాంత్కుమార్రెడ్డి గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డి ద్వారా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించేలా చేశారు. ప్రభుత్వం స్పందించి, బొక్కల పరిశ్రమను మూసివేయించింది. బండరావిరాల, చిన్నరావిరాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న మైనింగ్ జోన్ సమస్యలను అక్కడికే వెళ్లి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు చేస్తున్న దీక్షా శిబిరంలో వారికి మద్దతు తెలిపారు. 51 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గడపగడపకూ వెళ్లి అభివృద్ధిని వివరించా : మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి
నియోజకవర్గంలో 63 రోజులపాటు 95 గ్రామాల్లో 771 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి గడపగడపకు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించడంతో పాటు ప్రజల అవసరాలను తెలుసుకున్నానని మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చేసిన అభివృద్ధిని వివరించడానికి పాదయాత్ర చేశానని చెప్పారు.
నియోజకవర్గంలో ప్రతిపక్షం, ప్రభుత్వ పక్షం, ప్రజా పక్షం కూడా బీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. పాదయాత్ర సందర్భంగా మైనింగ్ జోన్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని, దీన్ని నెరవేర్చాలని మంత్రి కేటీఆర్కు విన్నవించారు. పాదయాత్ర సందర్భంగా తాను పర్యటించిన గ్రామాల్లో అతి ముఖ్యమైన పది సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిపారు.