రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో పుడమితల్లి పులకరించింది. సబ్బండ వర్ణాలు కదం తొక్కి మొక్కలు నాటగా పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. కాలనీలు, రహదారుల ఇరువైపులా నాటి మొక్కలు పచ్చని తోరణాల్లా దర్శనమిచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో శనివారం ఒక్కరోజే 5.40లక్షల మొక్కలు నాటారు. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి మహేందర్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, రంజిత్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, రోహిత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అలాగే ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, కేశంపేటలో అంజయ్యయాదవ్ పాల్గొని మొక్కలు నాటగా.. ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని హరిత స్ఫూర్తిని చాటారు.
పుడమి తల్లికి పచ్చని తోరణం కట్టేందుకు రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’తో భారతావని మురిసిపోయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్బండ వర్ణాలు కదం తొక్కాయి. ఒకే రోజున 5.40 లక్షల మొక్కలు నాటేందుకు కదిలిన అశేష జనవాహినిని చూసి పుడమితల్లి పులకించిపోయింది. మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, రంజిత్ రెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని హరిత స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజానీకం, విద్యార్థులు పాల్గొని ఉద్యమంలా మొక్కలు నాటారు.
ఆకుపచ్చని ఆకాంక్షకు తోడుగా..
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం విజయవంతమైంది. ఒకే రోజు 5.40లక్షల మొక్కలను ప్రజానీకం నాటి పచ్చని తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి దన్నుగా నిలిచింది . ప్రతి పంచాయతీలోనూ 750 మొక్కలు నాటాలన్న లక్ష్యంతో సిద్ధమైన ప్రజాప్రతినిధులు, అధికారులు అనుకున్న లక్ష్యం మేరకు మొక్కలను నాటారు. అవసరానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీశాఖలు మొక్కలను సమకూర్చగా.. 588 గ్రామపంచాయతీల్లో పక్కాగా ప్రణాళికను అమలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితం సాగింది.
జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మంచిరేవులలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులతో కలిసి పాల్గొన్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు. ఇబ్రహీంపట్నంలో మంత్రి తలసానితో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మొక్కలు నాటారు. కేశంపేటలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మొక్కలు నాటారు. మంచిరేవులలో సీఎస్ శాంతి కుమారి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డ్రోబియల్, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎం.డీ చంద్రశేఖర్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొని మొక్కలు నాటారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల కోటి వృక్షార్చనలో భాగస్వాములై కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
256 ఎకరాల్లో.. రూ.7.88 కోట్లతో..
చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కును 256 ఎకరాల్లో రూ.7.88 కోట్లతో అభివృద్ధి చేశారు. నగరంలోని కేబీఆర్ పార్కు, బొటానికల్ పార్కు తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అవతరించింది. ఇక్కడున్న ప్రత్యేక సఫారీ వాహనాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు కలియదిరిగి మౌలిక వసతులను పరిశీలించారు. వాచ్ టవర్, గజిబో, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, ఆంఫీథియేటర్, వాటర్ ఫాల్స్ వంటివి ఆకర్షణగా నిలుస్తున్నాయి.