ధారూరు, సెప్టెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలోనో, చెట్ల కింద, రచ్చ బండ తదితర ఖాళీ స్థలాల్లో సభలకు, సమావేశాలు నిర్వహించేది. ప్రస్తుతం రైతు వేదికలు నిర్మించారు. ప్రతి రైతు వేదికలో వ్యవసాయ అధికారి ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రైతు వేదిక పరిధిలో నాలుగు, ఐదు గ్రామ పంచాయతీలు ఉండే విధంగా క్లస్టర్ ను ఏర్పాటు చేశారు. ధారూరు మండల పరిధిలో ఏడు రైతు వేదికలు ఏర్పాటు చేశారు. మండల పరిధిలో మొత్తం 34,726ఎకరాలు సాగు చేస్తున్నారు. ప్రతి వారం వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులకు పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు పొలాల్లో క్షేత్ర పర్యటన చేసి రైతులకు సూచనలు అందిస్తున్నారు.
మండల పరిధిలో మోమిన్కలాన్, నాగారం, గురుదోట్ల, ధారూరు, నాగసముందర్, మున్నూర్ సోమారం, కెరెళ్లి గ్రామాల్లో రైతు వేదికలు నిర్మించారు. మోమిన్కలాన్ గ్రామ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో మొత్తం 4900 ఎకరాలు సాగవుతున్నది, క్లస్టర్ పరిధిలోని గ్రామాలు అంతారం, మోమిన్కలాన్, మోమిన్ఖుర్దు, రాజాపూర్ ఉన్నాయి. నాగారం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో 5490 ఎకరాలు సాగవుతుండగా క్లస్టర్ పరిధిలో నాగు సాన్పల్లి, తరిగోపుల, మైలారం, నాగారం గ్రామాలున్నాయి. గురుదోట్ల రైతు వేదిక క్లస్టర్ పరిధిలో 4586 ఎకరాలు సాగవుతున్నది. పులిచింతల మడుగుతండా, గురుదోట్ల, అం పల్లి, దోర్నాల్, కుమ్మరిపల్లి గ్రామాలు ఈ క్లస్టర్ పరిధిలో ఉన్నాయి.
అలాగే ధారూరు గ్రామ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో 5207 ఎకరాలు సాగవుతుండగా రాంపూర్ తండా, గట్టేపల్లి, ధారూరు, ధారూరు స్టేషన్, అవుసుపల్లి గ్రామాలున్నాయి. నాగసముందర్ గ్రామ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో 4300 ఎకరాలు సాగవుతున్నది. క్లస్టర్ పరిధిలో అల్లాపూర్, నాగసముందర్, రుద్రారం, గడ్డమీది గంగారం, నర్సాపూర్ గ్రామాలున్నాయి. అలాగే మున్నూర్ సోమారం క్లస్టర్ పరిధిలో 4933 ఎకరాలు సాగవుతుండగా క్లస్టర్ పరిధిలో కుక్కింద, ధర్మాపూర్, కోండాపూర్కలాన్, మున్నూర్ సోమారం గ్రామాలున్నాయి. కెరెళ్లి గ్రామ రైతు వేదిక క్లస్టర్ పరిధిలో 5310 ఎకరాలు సాగవుతున్నది. క్లస్టర్ పరిధిలో చింతకుంట, హరిదాస్పల్లి, అల్లీపూర్, ఎబ్బనూర్, కెరెళ్లి గ్రామాలున్నాయి.
రైతులకు ఎంతో ఉపయోగం..
రైతు వేదికలతో రైతులకు చాలా మేలు కలుగుతుంది. గతంలో ఎక్కడ సమావేశాలు నిర్వహించుకోవాలో తెలియని స్థితిలో ఉండేది. మండల కేంద్రానికి వెళ్లి వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలు చెప్ప కోలేకపోయేది. రైతు వేదికలు ఏర్పాటు చేయ డంతో రైతులు వారా నికి ఒక్కసారి వ్యవసాయ విస్తీర్ణ అధికారితో సమస్యలు తెలిపి సలహాలు తీసుకుం టున్నారు. దీంతో రైతుల ఇబ్బందులు తీరాయి.
-నర్సింహారెడ్డి, రైతు, మోమిన్ఖుర్దు
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఒక్కొక్క రైతు వేదికలో ఒక వ్యవసాయ అధికారి ఉంటూ రైతులకు సూచనలు అందిస్తున్నాం. వారానికి ఒక్కసారి రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తు న్నాం. ఏ సీజన్లో ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వ సూచనల మేరకు వారికి వివరిస్తున్నాం.
– సంజువ్రాథోడ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి