వికారాబాద్, సెప్టెంబర్ 20 : రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. వారి సంక్షేమానికి రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెరిగి పంటలు సాగు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. వికారాబాద్ చుట్టు పక్కల గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని, పంటలను అమ్ముకోడానికి మార్కెట్కు వస్తుంటారు. అలాంటి వారికి ఇబ్బందులు కలుగకుండా మార్కెట్ కమిటీ ప్రణాళిక పరంగా సౌకర్యాలు కల్పిస్తున్నది.
వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహకారంతో మార్కెట్ కమిటీ పాలక వర్గం ముందడుగు వేసి రైతులు, హమాలీలకు ఇటీవల ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో బీపీ, షుగర్ వంటి తదితర పరీక్షలు నిర్వహించి రిపోర్ట్లను అందజేశారు. అవసరమున్న వారికి మందులు, మాత్రలు, కండ్ల అద్దాలను పంపిణీ చేశారు. మార్కెట్ యార్డ్కు వచ్చే ఆదాయంతో పాటు హమాలీలు, రైతులు ఆరోగ్యంగా ఉండాలని వారికి ఉచితంగానే వైద్య పరీక్షలు చేశారు.
వికారాబాద్ మార్కెట్లో వారానికి రెండు రోజులు సోమవారం, గురువారాల్లో మార్కెట్ జరుగుతున్నది. ఈ మార్కెట్కు చుట్టు పక్కల గ్రామాల రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోడానికి వస్తుంటారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా వారానికి రెండు రోజులు రూ.5లకే నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. హరేకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆగస్టు 25వ రోజున ఎమ్మెల్యే ఆనంద్ ప్రారంభోత్సవం చేశారు. 360 మంది రైతులకు రూ.5లకే నాణ్యమైన భోజనం అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మార్కెట్లలో కేవలం గజ్వేల్, వంటిమామిడి, బోయిన్పల్లి, సిద్ధిపేట తరువాత వికారాబాద్ ఉంది. రైతుల ఆకలి తీర్చడంలో వికారాబాద్ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచింది. దీంతో వికారాబాద్ మార్కెట్కు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది.
రైతులకు సౌకర్యాలు
వికారాబాద్ మార్కెట్కు వచ్చే రైతులకు ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటు చేసింది. మార్కెట్ పరిసర ప్రాంతంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం, గురువారాల్లో రూ.5లకే అన్నపూర్ణ భోజనం అందిస్తున్నది. రూ.2.50కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, దుకాణాలు తదితర ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడే రైతులకు నైట్ షెల్టర్లను సైతం ఏర్పాటు చేయనున్నది. పశువుల సంతను నిర్వహిస్తున్న ప్రస్తుత స్థలం సరిపోనందునా.. మున్సిపల్ పరిధిలోని గెరిగెట్పల్లి సమీపంలో 5 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
మార్కెట్ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నాం. రైతులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మార్కెట్ యార్డు తరఫున 260 మందికి వైద్య శిబిరం, నేత్ర శిబిరాలు పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాటు చేశాం. దాదాపు 360 మంది వరకు రూ.5లకే అన్నపూర్ణ భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందుతున్నది. రూ.2.50కోట్ల నిధులు రావడంతో కాంప్లెక్స్లు, షెడ్లు, సీసీ రోడ్లు వేసి మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
– వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వికారాబాద్
రైతులకు ఉపయోగం
పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వికారాబాద్ మార్కెట్కు వచ్చే రైతులకు రూ.5లకే అన్నపూర్ణ భోజనం పెట్టడం సంతోషంగా ఉంది. ధాన్యాన్ని త్వరగా అమ్ముకునేందుకు రైతులు ఉదయాన్నే మార్కెట్కు వస్తారు. వారు మధ్యాహ్నం సమయంలో ఇబ్బందులు పడొద్దని మార్కెట్ కమిటీ పాలక వర్గం మంచి నిర్ణయం తీసుకున్నది. రైతులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు కల్పించింది. దూర ప్రాంతాల వారికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– పెద్ద అనంతయ్య, రైతు వికారాబాద్
వైద్య శిబిరాలు సంతోషకరం..
ప్రతి రోజూ వికారాబాద్ మార్కెట్ యార్డులో హమాలీ పని చేస్తా. మార్కెట్ కమిటీ పాలక వర్గం ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండే విధంగా పలు రకాల సూచనలు చేశారు. మరి కొన్ని రోజులకు నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో కంటికి సంబంధించిన పరీక్షలు చేసి, మందులు, కంటి అద్దాలను అందజేశారు.
– నర్సింహులు, హమాలీ, వికారాబాద్
మరింత అభివృద్ధి చేస్తాం..
మార్కెట్కు వచ్చే రైతులకు ప్రతి సోమ, గురువారాల్లో హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.5లకే అన్నపూర్ణ భోజనం అందజేస్తున్నాం. మార్కెట్ కమిటీ పాలక వర్గం సభ్యులతో కలిసి మార్కెట్ను మరింతగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– మేక చంద్రశేఖర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వికారాబాద్
మార్కెట్ అభివృద్ధికి కృషి
వికారాబాద్ మార్కెట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు, అధికారులతో మాట్లాడి రైతులకు సరైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. హమాలీలు, రైతులకు వైద్య పరీక్షలు చేసి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. నేత్ర శిబిరం ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి వారికి మందులు, కంటి అద్దాలను అందజేశాం. వచ్చే నిధులతో మార్కెట్లో పలు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
– ముద్ద దీప, మార్కెట్ కమిటీ చైర్పర్సన్,వికారాబాద్