రంగారెడ్డి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతన్నల కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన మాట మేరకు రుణాలను మాఫీ చేయడంతోపాటు ఇన్ఫుట్ సబ్సిడీ, అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులకు పరిహారం చెల్లింపులతోపాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రధానంగా ఎన్నిక సమయంలో రైతులకిచ్చిన వాగ్దానం ప్రకారం రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసింది. మొదటి విడతలో మూడేండ్లలో రుణ మాఫీని పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా నిలిచింది. రెండో విడుత రుణ మాఫీలో భాగంగా రూ.లక్షలోపు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేసేందుకు నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25వేలలోపు రుణాలను మాఫీ చేశారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన ప్రభుత్వం.. రెండేండ్లలోనే వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అమల్లోకి తీసుకువచ్చింది. ఇతర రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మండు వేసవిలోనూ నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తుండడం గమనార్హం. అదేవిధంగా రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నారు. ఎకరానికి 5 వేల చొప్పున ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నది.
ఐదేండ్ల్లలో రూ.185.95 కోట్ల బీమా సాయం
సీఎం కేసీఆర్ రైతుబీమా పథకంతో రైతు కుటుంబంలో కుటుంబానికి పెద్ద దిక్కు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. ఆ కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కాపాడడమే కాకుండా సంబంధిత కుటుంబం నిలదొక్కుకునేలా ఆదుకుంటున్నారు. రైతుబీమాతో మృతిచెందిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా ఆదుకుంటున్నారు. రైతుబీమా పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు ఐదేండ్లలో 3,719మంది రైతులు మరణించగా, సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.185.95 కోట్లను అందజేశారు. మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు తొలుత రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 835 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.41.75 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 825 మంది అర్హులుగా గుర్తించి రూ.41.25 కోట్ల సొమ్మును సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరం 1189 మంది రైతులు మృతిచెందగా రూ.59.45 కోట్ల డబ్బులను, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 854 మంది రైతులు మృతిచెందగా సంబంధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.42.70 కోట్ల బీమా సహాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10 దరఖాస్తులురాగా, పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు వెల్లడించారు. రైతుబీమా పథకంలో భాగంగా బీమా సంస్థలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఒక్కో రైతుకు రూ.3486 ప్రీమియం డబ్బును ప్రభుత్వం చెల్లిస్తున్నది. జిల్లావ్యాప్తంగా సుమారుగా 3 లక్షల మంది రైతులు ఉండగా సుమారుగా 1.50 లక్షల మంది రైతులు రైతు బీమాకు అర్హులుగా జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం గుర్తించింది. 2019-20 సంవత్సరంలో ఒక్కో రైతుకు 3013 చొప్పున రూ.45.19 కోట్ల ప్రీమియం డబ్బును ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించగా, గతేడాది ప్రీమియం డబ్బు పెరిగిన దృష్ట్యా.. ఒక్కో రైతుకు రూ.3486లు చొప్పున రూ.52.29 కోట్ల ప్రీమియం డబ్బును ప్రభుత్వం బీమా సంస్థకు చెల్లించింది.
సీఎం కేసీఆర్ మా కుటుంబానికి పెద్ద దిక్కయ్యారు
మా కుటుంబానికి పెద్దదిక్కైన నా భర్త మహ్మద్ ఖలీల్ చనిపోతే ప్రభుత్వం రైతుబీమా కింద ఆర్థికసాయం అందజేసి సీఎం కేసీఆర్ మా కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యారు. అదేవిధంగా ప్రభుత్వం అందజేసిన రూ.5 లక్షల బీమా పరిహారం మాకు ఆసరా అయ్యింది. నా భర్త మాకున్న 1-20 గుంటల భూమిలో వ్యవసాయంతో పాటు బయటి పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. 2018 సంవత్సరం డిసెంబర్లో ఆకస్మికంగా నా భర్త చనిపోయాడు. నేను, నా నలుగురు పిల్లల జీవనం ఇబ్బందికరంగా మారింది. అలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబీమా కింద రూ.5 లక్షలు అందజేసి ఆదుకున్నది. రైతుబీమా డబ్బులు కష్టకాలంలో నా కుటుంబానికి అందింది.
– జరీనాబేగం, కేశంపేట
ఆపదలో అండగా..
నా భర్త చనిపోయి కష్టాల్లో ఉన్న మాకు కేసీఆర్ సార్ రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు అందజేసి మమ్ములను ఆదుకున్నారు. నా భర్త బురమోని వెంకటయ్య పేరున 2 గుంటల పొలం మాత్రమే ఉన్నది. నా భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో రైతుబీమా కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో నేను నా ఇద్దరు పిల్లలకు లబ్ధి చేకూరింది. మా కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్కు రుణపడి ఉంటాం. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. రైతుబీమాతో మృతిచెందిన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు.
– బురమోని కొమురమ్మ, కేశంపేట