ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్18 : అట్టహాసంగా కొనసాగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కవులు, కళాకారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఘనంగా సన్మానించగా, వికారాబాద్లోని అంబేద్కర్ భవన్లో కవులు, కళాకారులను కలెక్టర్ నిఖిల సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పోరాడి అమరులైన వారి త్యాగాలను మరువద్దన్నారు. నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి చేసేందుకు జరిగిన పోరాటంలో కవులు, కళాకారుల పాత్ర కీలకమన్నారు. చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి వారు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. కొంత మంది చరిత్రను వక్రీకరించి విద్వేషాలను రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మూడు రోజులుగా జరిగిన వజ్రోత్సవాలను విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగాన్ని, నృత్య ప్రదర్శనలతో చూపరులను అలరించిన విద్యార్థులను మంత్రి అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది పోరాడి అమరులయ్యారని, వారి త్యాగాలను మరిచిపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాచరిక వ్యవస్థనుంచి హైదరాబాద్ ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలో కలిసేందుకు ఎంతో మంది పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. నైజాం కబంధ హస్తాల నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకోవటానికి జరిపిన పోరాటంలోనూ కవులు, కళాకారుల పాత్ర ఎంతో ఉన్నదని అన్నారు. చాకలి ఐలమ్మ, కొమురంభీం లాంటి వారు పోరాటం జరిపి నేడు స్ఫూర్తిదాయకంగా నిలిచారని పేర్కొన్నారు.
కానీ కొంత మంది చరిత్రను వక్రీకరించి విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని వేరు చేసే కుట్ర జరుగుతుందని ఆమె అన్నారు. తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగు నీరు అందించారని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, తదితర వంటి చారిత్రాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతుల కోసం రైతుబంధు ద్వారా పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించి ఆర్థికంగా, రైతుబీమా తీసుకువచ్చి వారికి మరింత భరోసాను కల్పించారని పేర్కొన్నారు. మూడు రోజులుగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసిన కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులను మంత్రి అభినందించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.
కవులు, కళాకారుల పాత్ర మరిచిపోలేనిది..
ఇప్పటి వరకు జరిగిన అనేక ఉద్యమాల్లో కవులు, కళాకారుల పాత్ర మరిచి పోలేనిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా వారు ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం నుంచి మనం విముక్తి పొందేందుకు కవులు, కళాకారులు తమ పాటలు, ఆటల ద్వారా చేపట్టిన పోరాటం స్ఫూర్తినిచ్చిందన్నారు.
కేసీఆర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన పోరాటం మరిచి పోలేనిదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి అన్నారు. ఇక్కడి పథకాల అమలు కోసం ఆయా రాష్ర్టాల ప్రతినిధుల బృందాలు తెలంగాణకు వస్తున్నాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ర్టాలు కూడా తెలంగాణవైపు చూస్తున్నాయన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ దయానంద్, కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియా, డీఈవో సుశీందర్రావు, ఆర్డీవో వెంకటాచారి పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా కవులు, కళాకారులకు సన్మానం
వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరిచిన కవులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీధి బాగోతం కళాకారుడు శివయ్య, యక్షగానం కళాకారుడు అంజయ్య, తంబుర కళాకారిణి భారతమ్మ , రంగస్థల కళాకారుడు వెంకటస్వామి, కూచిపూడి కళాకారుడు క్రాంతి నారాయణతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వెంకటయ్య, శివకుమార్, జయరాం, భీమయ్య, నర్సింహులు, యాదయ్య, వసంత, సంధ్య సునీత, జిల్లా సాంస్కృతిక మండలి కళాకారులను ఘనంగా సన్మానించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆమనగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆమనగల్లు కస్తూర్బా పాఠశాల, కందుకూరు కస్తూర్బా పాఠశాలల విద్యార్థులు పలు ప్రదర్శనలు చేశారు. సమరయోధుల వేషధారణలు ఎంతో ఆకట్టుకున్నాయి. నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న అమరుల జీవిత చరిత్రపై పలు ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులందరికీ మంత్రి జ్ఞాపికలను అందజేశారు.
సాయుధ పోరాట యోధులు, కవులు, కళాకారుల త్యాగాలు స్మరించుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం వికారాబాద్లోని అంబేద్కర్భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఏడాదికి రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది తెలంగాణ దేశంలో అంతర్భాగమై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను మూడు రోజులు ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ఇందుకు కారణమైన ఎందరో సాయుధ పోరాట యోధులు, కవులు, కళాకారులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలు జరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు జిల్లాలో అందరి సహకారంతో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వజ్రోత్సవాల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో కవులు, కళాకారులను సన్మానించుకోవడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలకుల నుంచి పోరాడి సాధించుకున్నామని, ఆ పోరాటంలో అమరులైన వారిని స్మరించుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది ఒక మత పోరాటం కాదని, నిజాం రజాకారులతో పోరాడి తెలంగాణ ప్రాంతాన్ని అఖండ భారతావనిలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, అందువల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నామని అన్నారు. ప్రతి ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో గొప్పదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా కవులు సంగీతపు రాజలింగం, గంటా మనోహర్రెడ్డి, పర్వతపల్లి బందెప్పగౌడ్, విశ్వనాథజ్యోషి, వడిచర్ల సత్యం, బాలకృష్ణ, రాఘవేంద్రచార్య, సి.నరసింహులు, దివాకరశాస్త్రి, మున్నూరు రాజు, కళాకారులు ఎల్.అశోక్, కె.రమేశ్, నర్సింహులు, కాశీనాథ్, వెంకటేశం, దేవయ్య, శంకర్, వెంకటయ్యలను జిల్లా కలెక్టర్ నిఖిల, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్లు సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బి.విజయకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ, డీఆర్వో అశోక్కుమార్, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఈవో రేణుకాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి హన్మంత్రావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, డీఆర్డీవో కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఆర్డీవో విజయకుమారి, ఎంపీడీవో సత్తయ్య, తహసీల్దార్ షర్మిల పాల్గొన్నారు.