న్యూస్ నెట్వర్క్,నమస్తే తెలంగాణ;నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్ అమలు ప్రకటనలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం పల్లెపల్లెనా ర్యాలీలు తీసి, ప్రధాన కూడళ్ల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. తండాలను పంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్.. దళితబంధు మాదిరిగా గిరిజన బంధునూ అమలు చేస్తానన్న ప్రకటనపై గిరిపుత్రులు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయానికి మహోన్నత వ్యక్తి అంబేద్కర్ పేరు పెట్టడంపై సబ్బండ వర్గాలు హర్షిస్తున్నాయి.
రాష్ట్రంలోని గిరిజనులకు త్వరలోనే పది శాతం రిజర్వేషన్లతోపాటు నిరుపేద ఎస్టీలకు గిరిజన బం ధును కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా గిరిజనులు, ఆ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి, స్థానిక గిరిజనులకే పాలన అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటన గిరిపుత్రుల సమగ్రాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం చిత్రపటాలకు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, దళిత సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు క్షీరాభిషేకాలు చేశారు.
చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం
సీఎం కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. పది శాతం రిజర్వేషన్ అమలైతే గిరిపుత్రులకు విద్యాఉద్యోగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. గిరిజన బంధుతో నిరుపేద ఎస్టీలకు ఎంతో మేలు జరుగుతుంది. లఘు, కుటీర పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. గిరిజనుల బాగుకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
–నేనావత్ అనురాధ ,జడ్పీటీసీ ఆమనగల్లు
గిరిజనుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యం
గిరిజనుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్, గిరిజనబంధు వంటి పథకాలను అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీ యం. గిరిజన సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆరే. ఆయనకు గిరిజనులు, ఆది వాసీలు రుణపడి ఉంటారు. గిరిజన గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఆయనతోనే సాధ్యమవుతుంది.
–బాలూనాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షాద్నగర్
మా బతుకులు మారాయి
గత ప్రభుత్వాలు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మా బతుకులు మారాయి. ప్రతి తండాకూ రవాణా సౌకర్యం కల్పించడంతోపా టు చాలా తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గిరిపుత్రులకు పది శాతం రిజర్వేషన్తోపాటు గిరిజనబంధును కూడా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. –లక్ష్మణ్నాయక్,
టీఆర్ఎస్ పార్టీ ఫరూఖ్నగర్ మండలాధ్యక్షుడు ,