వికారాబాద్, సెప్టెంబర్ 17: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకపోవడంతో వడ్డీ పేరుకుపోయిన రుణగ్రహీతలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి శీతల్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రుణ గ్రహీతలకు రుణాలను సులువుగా చెల్లించే విధానంపై సూచించడంతోపాటు బ్యాంకు అధికారులకు పలు సూచనలు చేశారు.
రాజీవ్ గృహకల్ప ఇండ్ల నిర్మాణం జరిగినప్పుడు పలువురు లబ్ధిదారులు బ్యాంకుల నుంచి రుణాలను పొందారు. కానీ ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. వారిని కోర్టుకు పిలిచి రుణాలను వాయిదా పద్ధతిలో చెల్లించాలని జడ్జి సూచించారు. కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
బ్యాంక్ కేసుల కోసం ప్రత్యేక లోక్ అదాలత్
నాంపల్లి క్రిమినల్ కోర్టు, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మెట్రో పాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకు కేసులకు సంబంధించి శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. నాలుగు సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్లో, రెండు మనోరంజన్ కోర్టు కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సెషన్స్ జడ్జి పాపిరెడ్డి 1వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కుశ పరిశీలించారు.