ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 16 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని హర్షిస్తూ ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ గొప్పతనాన్ని దేశంతో పాటు ప్రపంచ నలుమూలల చాటేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం లాగానే.. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, ఎంపీపీ కృపేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కర్నాటి రమేశ్గౌడ్, చిలుకల బుగ్గరాములు, చీరాల రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రాజు, రాజేశ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ .బీఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భారతదేశానికే ఆదర్శమని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. కేంద్రం కూడా సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాల్రాజ్, సర్పంచ్లు వెంకటేశం గుప్తా, జహంగీర్, లావణ్య, భీమయ్య, నాయకులు యాదగిరి, నర్సింహులు, పెంటారెడ్డి, జంగయ్య, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.
షాబాద్ : తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమని దళితరత్న అవార్డు గ్రహీత చొక్కంపేట్ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ గొప్ప నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.