బొంరాస్పేట, సెప్టెంబరు 11 : ఎక్కడో విసిరేసినట్టు అడవులు, చెలకల మధ్యలో కొన్ని ఇండ్లు. వానొస్తే జలజల కారే గడ్డిపాకల్లోనే వారి జీవనం. తాగటానికి సరిపడా నీరు దొరకదు, కడుపునిండా తిండి ఉండదు. వేరే ఊరికి వెళ్లాలంటే కిలోమీటర్లకొద్దీ చెమటలు కక్కుతూ నడువాలి. ఇదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణాలోని గిరిజన తండాల జీవన చిత్రం. కానీ నేడు వాటి రూపమే మారిపోయింది. తండాలు స్వయం పాలనకు వేదికలయ్యాయి. ప్రతి ఇంటినీ మిషన్ భగీరథ పలకరిస్తుంది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఊరి బయట వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంప్యార్డు వచ్చాయి. తండా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి ప్రతినెలా నిధులు మంజూరవుతున్నాయి. ఈ నిధులతో తండాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కలలో కూడా ఊహించని ఈ మార్పు వెనుక ఉన్నది సీఎం కేసీఆర్. ఏనాడూ చూడని సింగారాలు సంతరించుకుని స్వయం పాలనతో ప్రగతిపథాన దూసుకుపోతున్నాయి. తండాల్లో నేడు గిరిజన బిడ్డలే పాలకులు. వాళ్లే పాలితులు. 2008 ఏప్రిల్ 11వ తేదీన నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు చేసిన ఒక ప్రతిజ్ఞ ఫలితం నేడు ప్రతి లంబాడా తండాలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ‘అపన్ తండేమ అపనో రాజ్’ పేరిట మన తండాలో మనరాజ్యం రావాలని కోరిన గిరిజనులకు ఆనాడు అభయమిచ్చిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తరువాత వారి కలను సాకారం చేశారు. ఒకనాడు ప్రధాన గ్రామ పంచాయతీకి అనుబంధ పల్లెలుగా ఉండి తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తండాలు నేడు సకల సౌకర్యాలతో గ్రామ పంచాయతీలుగా వర్ధిల్లుతున్నాయి.
జిల్లాలో పంచాయతీలుగా మారిన 84 తండాలు
500 జనాభా ఉన్న తండాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా చేసింది. ఈ లెక్కన రెండు మూడు తండాలను కలిపి జిల్లాలో మొత్తం 84 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. అంతకు ముందు 21 తండాలు గ్రామ పంచాయలుగా ఉండేవి. వీటిని కలుపుకుని జిల్లాలో తండా పంచాయతీల సంఖ్య 105కు చేరింది.
వికసిస్తున్న తండాలు
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గిరిజన తండాలు పంచాయతీలుగా మారిన తరువాత అద్భుత ప్రగతిని సాధిస్తున్నాయి. పంచాయతీలుగా మారిన 84 తండాలతో పాటు పాతవి 21 కలిపి మొత్తం 105 తండాలకు గిరిజనులే సర్పంచులయ్యారు. సుమారు వెయ్యి మంది వరకు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. సర్పంచ్లు, వార్డు సభ్యులుగా గిరిజనులే ఎన్నికై స్వపరిపాలన చేసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక్కో తండాలో ఇద్దరి నుంచి ముగ్గురి వరకు మల్టీ పర్పస్ వర్కర్లు వచ్చారు. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. తండాల్లో అభివృద్ధి పరుగులు పెట్టేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే కారణమని గిరిజనులు గర్వంగా చెప్పుకుంటున్నారు.
తండాల్లో అభివృద్ధి పనులు
గతంలో తండాలకు నిధులు వచ్చేవి కావు. ప్రధాన గ్రామ పంచాయతీల్లోని పనులకే ప్రాధాన్యమిచ్చేవారు. శివారు గ్రామాలుగా ఉన్న తండాల అభివృద్ధిని పట్టించుకునేవారు కాదు. తండాలు పంచాయతీలుగా మారిన తరువాత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, ఒక్కో పంచాయతీకి ట్రాక్టర్ సహా అనేక వనరులు సమకూరాయి. వీటి కోసం ప్రభుత్వం ప్రతి తండాకు ప్రభుత్వం రూ.కోట్లలో నిధులు మంజూరు చేసింది. ఇవే కాకుండా ప్రభుత్వం ప్రతినెలా పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుంది. వీటిలో తండాలో కావాల్సిన అభివృద్ధి పనులను చేపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు తండాల్లోనే ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనివల్ల స్థానికులకు తండాల్లోనే ఉపాధి పనులు లభిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తండాల ప్రజలు మంచినీటికి నానా అవస్థలు పడేవారు. నేడు మిషన్ భగీరథ పుణ్యమా అని ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.
ముంబయిలో మేస్త్రీ పని చేసేవాణ్ని
నేను ముంబయిలో మేస్త్రీ పని చేసుకుని బతికేవాణ్ని. కేసీఆర్ సీఎం అయిన తరువాత లంబాడ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నేను సర్పంచ్గా నామినేషన్ వేశాను. తండా ప్రజలు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. కేసీఆర్ కృషితోనే తండాలకు నిధులు మంజూరై అభివృద్ధిచెందుతున్నాయి.
-బద్యానాయక్, మూడుమామిళ్లతండా సర్పంచ్, బొంరాస్పేట మండలం.
కేసీఆర్తోనే స్వయం పాలన వచ్చింది
సీఎం కేసీఆర్ కృషితోనే గిరిజనులకు స్వయం పాలన అధికారం వచ్చింది. గిరిజనులే సర్పంచ్లుగా ఎన్నికై స్వంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నరు. తండాలు గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల నిధులు నేరుగా తండాలకు వస్తున్నాయి. దీంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయి. పల్లె ప్రగతితో తండాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయి.
-చౌహాన్ అరుణాదేశు, జడ్పీటీసీ బొంరాస్పేట
పంచాయతీగా మారినంకే అభివృద్ధి
మా తండా ఇంతకు ముందు ఈర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన తరువాతనే తండాలో అభివృద్ధి పనులు జరిగాయి. ప్రతినెలా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతున్నాయి. తండాలో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం నిర్మించాం. చెత్త సేకరణకు, మొక్కలకు నీళ్లు పట్టడానికి ట్రాక్టర్ మంజూరైంది.
– లక్ష్మీబాయి, సంట్రకుంటతండా సర్పంచ్, బొంరాస్పేట మండలం.