పరిగి, ఆగస్టు 30 : బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన ప్రగతిపై బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,14,000 మంది రైతులకు రూ.1,457కోట్లు రుణాలు అందించే లక్ష్యం కాగా ఇప్పటివరకు 75,360 మందికి రూ.664కోట్లు రుణాలు మంజూరు చేసి 45.60శాతం లక్ష్యం సాధించామన్నారు. వ్యవసాయ కాలపరిమితి రుణాలు లక్ష్యం రూ.1,006కోట్లు కాగా రూ.126కోట్లు అందజేశారని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు రూ.1,016కోట్లు రుణ లక్ష్యం ఉండగా ఇప్పటివరకు రూ.142కోట్లు మంజూరు చేశారన్నారు. వీధి వ్యాపారులకు రెండో విడుతలో ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున జిల్లాలో 2460 మందికి రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 1426 మందికి రూ.3కోట్లు రుణాలు అందించారని చెప్పారు. 13,218 స్వయం సహాయక సంఘాలకు రూ.442కోట్లు రుణ లక్ష్యం ఉండగా 2856 సంఘాలకు రూ.146కోట్లు రుణాలు అందించారని పేర్కొన్నారు. కొత్తగా పంటరుణాలతోపాటు మత్స్యకారులు, గొర్ల పెంపకందారులకు విరివిగా రుణాలు అందించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్ రుణాలు వెంటనే మంజూరు చేయాలి
ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలకు సంబంధించిన పెండింగ్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి పంటరుణాల వివరాలు సేకరించి అందజేయాలని సూచించారు. మత్స్య శాఖ, పశు సంవర్దక శాఖ అధికారులు తమ పరిధిలో పూర్తి వివరాలు సేకరించి అందజేయాలన్నారు. సమావేశం అనంతరం గత సంవత్సరం అత్యుత్తమ సేవలు అందించిన బ్యాంకర్లు శ్రీరామకృష్ణ, అనుప్రభ, తరుణీబాయి, సుధాప్రమీల, రఘునందన్గౌడ్, శ్రీనివాసరావు, శివరామకృష్ణలకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా రాత్రి 2 గంటల వరకు ప్రత్యేక సేవలందించిన వికారాబాద్ ఎస్బీఐ మేనేజర్ బి.ఆర్.నాయక్కు కలెక్టర్ ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రాంబాబు, ఆర్బీఐ ఎల్డీవో తేజ్దీప్ బహరా, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్కుమార్, ఎస్బీఐ ఆర్ఎం శ్రీరామకృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ సయ్యద్ యూసఫ్అలీ, డీఆర్డీవో కృష్ణన్, అధికారులున్నారు.