బొంరాస్పేట, ఆగస్టు 17 : మినీ అంగన్వాడీ కేంద్రాలకు మంచి రోజులు రానున్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో గడిచిన పదేండ్లలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంఖ్య పెరిగింది. ఒకే టీచర్ ఉండడంతో వారికి సేవలు అందించడం కష్టతరంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని, ఇందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 300కుపైగా జనాభా, అర్బన్ ప్రాంతాల్లో 400కుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లోని మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే వికారాబాద్ జిల్లా పరిధిలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 18 మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. ఫలితంగా వీటిలో పనిచేసే టీచర్ల వేతనం పెరగడంతో పాటు ప్రతి కేంద్రానికి సహాయకురాలిని నియమించనున్నారు.
పదేండ్లుగా కొనసాగుతున్న మినీ అంగన్వాడీ కేంద్రాలు పెరిగిన జనాభా ప్రాతిపదికన ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. ప్రభుత్వం గతంలో చేపట్టిన కుటుంబ సర్వే ఆధారంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చనున్నది. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్, మర్పల్లిలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 18 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది.
కుటుంబ సర్వే ఆధారంగా మార్పు
పదేండ్ల కిందట అంగన్వాడీ కేంద్రాల పరిధిలో తక్కువ జనాభా ఉండడం, రెవెన్యూ గ్రామాలకు ఆవాసాలు దూరంగా ఉండడంతో నాటి ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పడు వాటి పరిధిలో జనాభా, కుటుంబాలు పెరగడంతో మినీ కేంద్రాల నుంచి సేవలు అందించడం కష్టతరంగా మారింది. వాటిని మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
అప్గ్రేడ్తో పెరగనున్న హెల్పర్ల పోస్టులు
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే ఉంటారు. హెల్పర్ ఉండరు. దీంతో అన్ని పనులు టీచరే చేయాల్సి వస్తుంది. మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయితే ప్రభుత్వం వీటికి హెల్పర్ పోస్టులను మంజూరు చేసి నియమిస్తుంది. దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్ మెయిన్ కేంద్రాల్లో ఉండే టీచర్ మాదిరిగా అన్ని పనులు చేస్తున్నా వారికి వేతనం మాత్రం తక్కువ. ప్రధాన కేంద్రాల్లో పనిచేసే టీచర్కు నెలకు వేతనం రూ.13,650లు ఉండగా, మినీ కేంద్రంలోని టీచర్కు రూ.7800లు మాత్రమే. అప్గ్రేడ్తో మినీ కేంద్రాల టీచర్ల వేతనం కూడా పెరిగి వారికి ప్రయోజనం కలుగుతున్నది.
అప్గ్రేడ్కు మార్గదర్శకాలు
మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో 300 కుపైగా జనాభా, అర్బన్ ప్రాంతాల్లో 400కుపైగా జనాభా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ అవుతాయి. వీటి ఆధారంగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఐసీడీఎస్ అధికారులను కోరగా, నిబంధనల ప్రకారం అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటికి ఆమోదం లభించిన వెంటనే మినీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి.
అప్గ్రేడ్కు 18 కేంద్రాలు..
మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం జిల్లా నుంచి ప్రతిపాదనలు అడిగారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో 18 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ ఆమోదం తరువాత ఇవి మెయిన్ కేంద్రాలుగా మారుతాయి.
– లలితాకుమారి, జిల్లా సంక్షేమాధికారి