వచ్చే నెలలో మరింతమంది అర్హులకు ఆసరా పింఛన్లు అందనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో ఆసరా కార్డుల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. ఈ నెలాఖరులోగా కార్డుల పంపిణీ పూర్తి చేసి.. సెప్టెంబర్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బులను జమ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 57 ఏండ్లకు పైబడినవారితోపాటు పెండింగ్లో ఉన్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు కలిపి మొత్తం 54,661 మందికి కొత్తగా పింఛన్ అందనున్నది. ప్రస్తుతం జిల్లాలో 1,57,853 మందికి ప్రతి నెలా రూ.36.72 కోట్లను ప్రభుత్వం అందిస్తున్నది. వచ్చే నెల నుంచి కొత్తవారితో కలుపుకొని 2,12,514 మందికి పింఛన్ అందనుండగా.. అదనంగా రూ.19.61 కోట్లు ఖర్చు చేయనున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 17, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ కార్డుల జారీ షురూ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే కొత్త పింఛన్దారులకు సంబంధించి లెక్కతేల్చిన జిల్లా యంత్రాంగం కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను జారీ చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పింఛన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఆయా మండలాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కార్డులను అందజేస్తున్నారు.
ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గానికి 48 కొత్త కార్డుల చొప్పున ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పంపిణీ చేశారు. పింఛన్ కార్డులను ఈ నెలాఖరులోగా జారీ చేసి సెప్టెంబర్ నుంచి పింఛన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా 57 ఏండ్లలోపు వారితోపాటు పెండింగ్లో ఉన్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులు కలిపి 54,661 మంది కొత్త పింఛన్దారులుగా లెక్క తేల్చారు.
అత్యధికంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10,025., రాజేంద్రనగర్లో 8,089., మహేశ్వరంలో 7,794., షాద్నగర్లో 7,136., ఎల్బీనగర్లో 6,404, చేవెళ్లలో 6,140., కల్వకుర్తి నియోజకవర్గంలో 4,697 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. కొత్త పింఛన్దారులతో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 2,12,514కు పెరుగనుంది. అదనంగా మరో రూ.19.61 కోట్లు ప్రభుత్వంపై భారం పడనుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు కలిపి 1,57,853 మంది ఆసరా పింఛన్దారులున్నారు.
ప్రస్తుతం నెలకు రూ.36.72 కోట్లను ప్రభుత్వం ప్రతి నెల ఆసరా పింఛన్ల నిమిత్తం ఖర్చు చేస్తున్నది. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం రూ.56.33 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం జిల్లాలో 1,57,853 మంది ఆసరా పింఛన్దారులుండగా, వీరిలో వయోవృద్ధులు-49,153, వితంతువులు-74,612, దివ్యాంగులు-25,479, గీత కార్మికులు-1945, చేనేత కార్మికులు-742, ఒంటరి మహిళలు-5864, బీడీ కార్మికులు-15 మంది ఉన్నారు.
నూతన ఫింఛన్లు అందజేయడం సంతోషం
– భీమయ్య, అల్లవాడ
ప్రభుత్వం నూతన ఫింఛన్లు మంజూరు చేసి పేదలకు అండగా నిలబడటం సంతోషంగా ఉంది. పింఛన్లు మాలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతాయి. గతంలో కేవలం రూ.200 ఉన్న పింఛన్లను టీఆర్ఎస్ సర్కారు రూ.2016లకు పెంచి అందరిలో ఎనలేని సంతోషాన్ని నింపింది. ప్రభుత్వానికి రుణపడిఉంటాం.
కేసీఆర్ సారు సల్లంగ బతుకాలే : మల్లమ్మ, చర్లపటేల్గూడ (ఇబ్రహీంపట్నంరూరల్)
సాన రోజుల నుంచి పింఛన్ వస్తదని ఎదురుచూస్తున్నా. నాకు కాళ్లు, చేతులు ఆడుతలేవు. పానం చేతకాకుంట అయ్యింది. కోడళ్లు, కొడుకులు చేయిదాటిపోయిండ్రు. కష్టకాలంలో కేసీఆర్ సారు పెద్దకొడుకు లాగా ఆదుకుంటుండు. పింఛన్ ఇచ్చేందుకు నాకు మండలాఫీసుకాడ కారటు ఇచ్చిండ్రు. సాన సంతోషంగా ఉంది. సారును ఎల్లకాలం యాది పెట్టుకుంట.
పింఛన్ రావడం సంతోషంగా ఉంది
– భాగ్యమ్మ, ఇబ్రహీంపట్నం
పింఛన్ కోసం ఎన్నో రోజులుగా సర్కారు ఆఫీసుల సుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఎన్నో రోజులుగా పింఛన్ పైసల కోసం ఎదురుచూస్తున్న. సీఎం కేసీఆర్ పింఛన్ ఇస్తాడని మా ఊర్ల సర్పంచ్ మండలాఫీసుకాడికి రావాలని చెప్పంగనే చానా సంతోషపడ్డ. నాకు పింఛన్ కార్డు ఇచ్చిండ్రు. ఇక పింఛన్ వస్తుందని చాలా సంతోషంగా ఉంది.
కేసీఆర్ సార్ నాకు పెద్దన్న
– చంద్రమౌళి, ఆమనగల్లు
నేను ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారాను. దీంతో కుటుంబమంతా ఆగమాగమైంది. ప్రభుత్వం నాకు రూ.3016 పింఛన్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ సార్ నన్ను పెద్దన్నగా ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటాను.