ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలోని శాస్ర్తా గార్డెన్ నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా మంగల్పల్లి వరకు రూ.58కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రాయపోల్, తూప్రాన్పేట్, ఆగాపల్లి, కందుకూరు ఎక్స్రోడ్డు, గున్గల్ లోయపల్లి, ఇబ్రహీంపట్నం రంగాపూర్తో పాటు అన్ని గ్రామాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ పనులు నేటి నుంచి ప్రారంభమై అతిత్వరలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేసి వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి అన్నారు. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సోమవారం మంచాల మండలం ఆగపల్లి గ్రామంలో కొత్త లబ్ధిదారులకు ఆసరా పింఛన్లకు సంబంధించిన గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అర్హులందరికీ త్వరలో రేషన్ కార్డులు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 15 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు అందజేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో 40మందికి, క్యాంపు కార్యాలయంలో 40మంది మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు ఆయన పింఛన్లను పంపిణీ చేశారు.
ఆసరా పథకం దేశానికే ఆదర్శం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంద్రాగస్టు సందర్భంగా ప్రభుత్వం రూ.200 కోట్లతో పది లక్షల మందికి ఆసరా పథకం కింద నూతన పింఛన్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే రూ.800 కోట్లతో 36లక్షల మందికి ప్రభుత్వం పింఛన్లను అందిస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో మొత్తం 46లక్షల మందికి పింఛన్లు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నూతన పింఛన్ల పంపిణీలో భాగంగా డయాలసిస్ రోగులకు కూడా నూతనంగా పింఛన్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమాల్లో ఎంపీపీలు కృపేశ్, సుకన్య, నర్మద, జడ్పీటీసీలు జంగమ్మ, నిత్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ యాదగిరి, కమిషనర్ యూసఫ్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.