షాబాద్, ఆగస్టు 12:ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తూ, విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ పాఠశాల విద్యార్థుల మధ్యలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైక్యత, రక్షాబంధన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు రాఖీ పండుగ జరుపుకున్నారు. అనంతరం ఐసీడీఏస్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో విశ్వవిద్యాలయాల్లో అమ్మాయిల శాతం పెరిగిందని, దాంతో సీఎం మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించిన్నట్లు తెలిపారు. విద్యార్థినులకు డిక్షనరీలు పంపిణీ చేసిన మంత్రి, బాగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రతి మహిళలకు, విద్యార్థినులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజా, ఎంపీడీవో రాజ్కుమార్, సీడీపీవో శోభారాణి, నాయకులు వెంకటేశ్, చింటు, గోపాల్రెడ్డి, సత్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.