కేబినెట్ నిర్ణయాలతో వికారాబాద్ జిల్లాకు మహర్దశ వచ్చింది. సీఎం కేసీఆర్ తాండూరుపై వరాల జల్లు కురిపించారు. తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో వికారాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటుకు పరిపాలన అనుమతులను మంజూరు చేశారు. తాండూరు నూతన మార్కెట్ కమిటీ ఏర్పాటుకు సర్వే నంబర్ 52లో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించడం హర్షణీయం. అలాగే ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో వ్యాపారాల నిమిత్తం సరుకులను తీసుకొచ్చే వందలాది లారీలకు పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తూ షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో వికారాబాద్ జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– పరిగి, ఆగస్టు 12
పరిగి, ఆగస్టు 12: సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్లో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో వికారాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిసింది. అనేక దశాబ్దాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కేబినెట్ నిర్ణయాలు దోహదం చేస్తాయన్నది వాస్తవం. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మూడు ప్రధాన నిర్ణయాలు వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందినవే కావడంతో ఈ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఈనెల 16న సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా పర్యటనకు ముందు జిల్లాకు సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు మేలు జరుగనున్నది.
వికారాబాద్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులకు కూడా ఆమోదం తెలిపింది. గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్లో తాండూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో తాం డూరు మార్కెట్ కమిటీ ఏర్పాటుకు 30 ఎకరాల స్థలం కేటాయింపు, ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలంతోపాటు షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. వికారాబాద్ జిల్లాలోని ఒక నియోజకవర్గానికి సంబంధించి మూడు ప్రధాన అంశాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం చరిత్రలోనే మొదటిసారిగా చెప్పొచ్చు.
పరిష్కారం కానున్న దశాబ్దాల సమస్యలు
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న మూడు కీలక నిర్ణయాలతో దశాబ్దాల సమస్యలకు పరిష్కారం లభించనున్నది. ప్రధానంగా నూతన మార్కెట్ యార్డు నిర్మాణంతో సువిశాలమైన స్థలంలో కొత్తగా మార్కెట్ను నిర్మించడం ద్వారా వ్యాపార లావాదేవీలు మరింత సులభంగా జరిపేందుకు అవకాశం కలుగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక కొత్త మార్కెట్ను నిర్మించనున్నారు. మార్కెట్ కోసం ప్రత్యేకంగా సర్వేనంబర్ 52లో 30 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించడంతో అక్కడ కొత్తగా షాపుల నిర్మాణంతోపాటు ఓపెన్ ప్లాట్ఫారాలను నిర్మిస్తే రైతులకు మరింత ఉపయోగకరంగా ఉండనున్నది.
వికారాబాద్ జిల్లాలోనే తాండూరు మార్కెట్ పెద్దది. తాండూరు మార్కెట్లో ప్రతి ఏడాది రూ. 300కోట్ల నుంచి రూ.400 కోట్లు వరకు లావాదేవీలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే మార్కెట్కు నూతనంగా షాపులు, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడం హర్షణీయం. అదేవిధంగా తాండూరు చుట్టుపక్కల ఉన్నటువంటి షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్లను ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు చక్కటి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దోహదం చేయనున్నది. పాలిషింగ్ యూనిట్ల నిర్మాణానికి ప్రభుత్వం 45 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని చదునుచేసి పాలిషింగ్ యూనిట్లకోసం కేటాయించనున్నారు.
సుమారు 500 పైచిలుకు పాలిషింగ్ యూనిట్లు ఈ స్థలంలో ఒకేచోట ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాల స్థలం కేటాయింపు.. వ్యాపార కేంద్రంగా కొనసాగుతున్న తాండూరులో వందలాది లారీలున్నాయి. వాటిని ఒకేచోట నిలిపేందుకు అవసరమైన స్థలం లేకపోవడం స్థలం ఉన్న దగ్గర, రోడ్ల పక్కన నిలపాల్సి వస్తున్నది. దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 15 ఎకరాల స్థలాన్ని కేటాయించడం ద్వారా లారీలను ఒకే చోట నిలిపేందుకు ఆస్కారం ఉండటంతోపాటు మెకానిక్ షెడ్లను కూడా ఏర్పాటు చేసేందుకు చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో తాండూరు నియోజకవర్గానికి మహర్దశ పట్టనున్నది.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు
తాండూరులో షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు జిన్గుర్తి సమీపంలో 45 ఎకరాలు, ఆటోనగర్కు 15 ఎకరాలు, కోకట్లో మార్కెట్ ఏర్పాటు కోసం 30 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజల కోరికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూకేటాయింపులు చేసేలా చొరవ చూపిన ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి అభినందనలు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో తాండూరు ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది.
-పి.సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
ప్రజల కోరికను మన్నించినందుకు..
తాండూరు పట్టణ శివారులో మార్కెట్ నిర్మాణానికి 30 ఎకరాలు, షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్ల ఏర్పాటుకు 45 ఎకరాలు, ఆటోనగర్ నిర్మాణానికి 15 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రజల కోరిక మేరకు భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
-జి.రంజిత్రెడ్డి, చేవెళ్లఎంపీ
వాతావరణ కాలుష్యం తగ్గుతుంది
రాష్ట్ర కేబినెట్ తీసుకున్న మూడు నిర్ణయాలతో తాండూరు ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరనున్నది. షాబాద్ బండల పాలిషింగ్ యూనిట్లను ఒకే దగ్గర ఏర్పాటు చేయడం ద్వారా వాతావరణ కాలుష్యం పూర్తిగా తగ్గనున్నది. మార్కెట్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజీ సదుపాయంతోపాటు రైతులకు విశ్రాంతి భవనం, ఇతర వసతులతో కూడిన కొత్త మార్కెట్ అందుబాటులోకి రానున్నది. ఆటోనగర్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే భారీ వాహనాల పార్కింగ్ సమస్య తీరుతుంది. రాష్ట్ర కేబినె ట్ ఈ మూడు అంశాలకు సంబంధించి భూమిని కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– రోహిత్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే