రంగారెడ్డి, ఆగస్టు 1, (నమస్తే తెలంగాణ): ఇతర శాఖలకు వీఆర్వోలను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన అనంతరం కొన్ని నెలలుగా విధులకు దూరంగా ఉన్న వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించిన జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆదేశాలతో ఆయా శాఖలకు వీఆర్వోలను కేటాయిస్తూ నిర్ణయించారు. వీఆర్వోల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి లాటరీ పద్దతిలో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగకుండా ఇతర శాఖలకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో 121 ప్రకారం వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయిస్తూ నిర్ణయించారు. అదేవిధంగా వీఆర్వోలను ప్రధానంగా జిల్లాలోని వ్యవసాయ, వైద్య, మున్సిపాలిటీ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేటాయించారు. వివిధ శాఖలకు సర్దుబాటు చేసిన వీఆర్వోలు కేటాయించిన శాఖల్లో నేటి సాయంత్రంలోగా రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఇతర శాఖలకు 274 మంది వీఆర్వోలు..
జిల్లాలోని 274 మంది వీఆర్వోలను ఇతర శాఖలకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని ఆయా శాఖల్లో ఖాళీలను వీఆర్వోలను కేటాయించారు. అత్యధికంగా మున్సిపాలిటీ శాఖకు 81 మంది వీఆర్వోలను కేటాయిస్తూ నిర్ణయించారు. పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖకు 40 మంది వీఆర్వోలను, ఉన్నత విద్యాశాఖకు 47 మంది, వైద్యారోగ్య శాఖకు 13 మంది, హోంశాఖకు 23 మంది, వ్యవసాయ శాఖకు 14 మందిని లాటరీ పద్ధతిలో కేటాయించారు. ఇతర శాఖలకు వీఆర్వోల కేటాయింపు ప్రక్రియ వీడియో రికార్డింగ్ ద్వారా జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో సర్దుబాటు ప్రక్రియను నిర్వహించారు.
40 శాఖలకు వీఆర్వోల సర్దుబాటు
– కలెక్టర్ డి.అమయ్కుమార్
జీవో 121 ప్రకారం జిల్లాలోని 274 మంది వీఆర్వోలను 40 శాఖలకు సర్దుబాటు చేసినట్లు కలెక్టర్ డి.అమయ్కుమార్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో వీడియో రికార్డింగ్తో పారదర్శకంగా సర్దుబాటు ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియను డ్రా పద్ధతిలో ఆయా శాఖలకు కేటాయించామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఏవో ప్రమీల, జిల్లా సంక్షేమ శాఖ అధికారి శ్రీధర్, సీపీవో ఓంప్రకాష్ పాల్గొన్నారు.
వికారాబాద్లో 188 మంది వీఆర్వోలకు..
పరిగి, ఆగస్టు 1 : జిల్లాలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న 188 మంది వీఆర్వోలకు జీవో నంబర్ 121 ప్రకారం వివిధ శాఖలకు లాటరీ పద్ధతిన శాఖలు కేటాయించినట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. సోమవారం డీపీఆర్సీ భవనంలో కేటాయింపుల ప్రక్రియను కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో నిర్వహించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా వీడియో రికార్డింగ్తో సహా నిర్వహించినట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు. కేటాయింపుల అనంతరం వీఆర్వోలకు పోస్టింగ్ ఆర్డర్ కాపీలు వెంటనే ఇవ్వనున్నామని, ఆర్డర్ పొందిన వెంటనే కేటాయించిన సంబంధిత శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. జిల్లా అధికారులందరూ కార్యాలయాల్లో ఉండి వీఆర్వోలను జాయిన్ చేసుకున్న తర్వాత నివేదికను అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, ఏవో అమరేందర్, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఆర్ఐలు పాల్గొన్నారు.