చేవెళ్ల టౌన్, జూన్ 10 : ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర గార్డెలో నర్సరీల యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సునంద హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 77 రిజిస్ట్రేషన్ కాని నర్సరీలు నర్సరీ చట్టం ప్రకారం విధిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అధిక ధరలకు మొక్కలను విక్రయించకూడదని, లైసెన్స్ లేని నర్సరీల నుంచి రైతులు నారు తీసుకోకూడదన్నారు. నర్సరీలకు సంబంధించిన రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ విజయ్ భాస్కర్రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.