రంగారెడ్డి, జూలై 22, (నమస్తే తెలంగాణ) :రంగారెడ్డి జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా మొత్తం 77లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 3.50 లక్షల గుంతలు తీయగా.. 2.72లక్షల మొక్కలను నాటారు. ఆయా శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించి ప్రతి ఒక్కరినీ హరితహారంలో భాగస్వాములను చేస్తున్నారు. అంతేకాకుండా నాటిన మొక్కలన్నింటిని బతికించుకునేలా జిల్లా యంత్రాంగం సంరక్షణ చర్యలు చేపట్టింది. గుంతలు తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ జియోట్యాగింగ్ చేస్తున్నది. ఈ ఏడాదికి సరిపడా మొక్కలను ఇప్పటికే అన్ని గ్రామాలు, పట్టణాల్లోని నర్సరీల్లో సిద్ధంగా ఉంచింది. అదేవిధంగా ప్రజలకు ఇంటింటికీ ఆరు చొప్పున పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
జిల్లాలో ఎనిమిదో విడుత హరితహారం ప్రారంభమైంది. జిల్లాలో 2022-23 సంవత్సరానికిగాను 77 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది జిల్లా అటవీశాఖతోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఎవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)తోపాటు ప్రధానంగా పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. అటవీ ప్రాంతంలోనూ మొక్కలు నాటే ప్రక్రియను జిల్లా అటవీ శాఖ చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అన్ని శాఖలను భాగస్వాములను చేయడంతోపాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు నిర్దేశించారు. గుంతలను తీసే ప్రక్రియ నుంచి ట్రీ గార్డుల ఏర్పాటుతో పాటు ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ చేస్తున్నారు. నిధుల కొరత ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం హరితనిధితో నిధులను సమకూరుస్తున్నది. పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు.
ఇప్పటివరకు నాటిన మొక్కలు 2.72 లక్షలు..
రంగారెడ్డి జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరందుకున్నది. జిల్లాలో ఇప్పటివరకు 2.72 లక్షల మొక్కలు నాటగా, 3.50 లక్షల మేర గుంతలు తీసే ప్రక్రియ పూర్తయ్యింది. రెండు, మూడు రోజుల్లో హరితహారం కార్యక్రమం వేగవంతం కానున్నది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 30 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించగా, అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇంటింటికీ ఆరు పూలు, పండ్ల మొక్కలను చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకుగాను ప్రతి నర్సరీలో మొక్కలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు నాటిన ప్రతి మొక్కనూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఏ గ్రామపంచాయతీలో ఎన్ని మొక్కలు నాటారు, ఎక్కడెక్కడ నాటారనే వివరాలు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు.
జిల్లాలో హరితహారం, పల్లెప్రకృతివనాలు, మండలానికి ఒక బృహత్వనం తదితర కార్యక్రమాలతో జిల్లా అంతటా పచ్చదనం కళకళలాడుతున్నది. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో జిల్లాలో గ్రీనరీ పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఏడేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17 సంవత్సరంలో 1.39 కోట్ల మొక్కలు, 2017-18 సంవత్సరంలో 71.04 లక్షలు, 2018-19 సంవత్సరంలో 86.12 లక్షల మొక్కలు, 2019-20 సంవత్సరంలో 1.02 కోట్ల మొక్కలు, 2021-22 సంవత్సరంలో 89 లక్షల మొక్కలను నాటారు. ఈ ఏడాది పూల మొక్కలతోపాటు నీడనిచ్చే మొక్కలు, టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, బొప్పాయి, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లావ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు.
మరో వారంలో వేగవంతం..
వారం రోజుల్లో మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం కానున్నది. జిల్లాలో ఈ ఏడాది లక్ష్యానికి సరిపోను మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. నాటిన ప్రతి మొక్కనూ జియోట్యాగింగ్ చేస్తాం. మొక్కల సంరక్షణకు చర్యలు చేపడుతున్నాం.
– నీరజా, డీఆర్డీఏ ఏపీడీ