సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 658 కేసులు నమోదు కాగా, అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 316 కేసులు నమోదు కావడం ఆందోళనకర విషయమని వైద్యులు అంటున్నారు. హైదరాబాద్ సహా నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి మొత్తం 409 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే గ్రేటర్, దానికి అనుబంధంగా ఉన్న రెండు జిల్లాల్లోనే 70 శాతానికి పైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. వైరస్లో తీవ్రత లేనప్పటికీ, వ్యాప్తి రేటు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఒక పక్క సీజనల్ కేసులు నమోదవుతున్న సమయంలోనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం కొంత ఆందోళన కలిగిస్తున్నదని, కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలకు దగ్గరి పోలికలు ఉన్నందున ప్రజలు కొంత అయోమయానికి గురయ్యే అవకాశం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు సకాలంలో స్పందించి ఏ చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, రిపోర్టు ఆధారంగా చికిత్స చేసే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
పండుగలతో పొంచి ఉన్న ముప్పు..
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో ప్రజలు పెద్దఎత్తున సామూహిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్కెట్లకు వెళ్లడం, ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా గ్రేటర్ పరిధిలో బోనాలు మొదలైన విషయం తెలిసిందే. లష్కర్ బోనాలు ముగిసినప్పటికీ ఈ నెల 24న హైదరాబాద్ బోనాలు, ఆ తరువాత శ్రావణ మాసం, వినాయక చవితి తదితర పండుగలు వరుసగా ఉండటంతో రానున్న రోజుల్లో వైరస్ వ్యాప్తి మరింత పెరుగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ బూస్టర్ తీసుకోవాలి
– డా.రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏండ్లు నిండి, రెండు డోసులు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరూ బూస్టర్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వల్ల వైరస్ ప్రభావం తగ్గుతుంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ప్రమాద తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. అయితే, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వైరస్ వచ్చిన దానికంటే.. వైరస్ వచ్చిపోయిన తరువాత పోస్ట్ కొవిడ్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే ప్రస్తుతం మనముందు ఉన్న ఆందోళనకరమైన అంశం. అందుకని ప్రజలు కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అర్హులైన వారంతా టీకా, బూస్టర్ తీసుకోవడం ఉత్తమం. మాస్క్ లేకుండా బయటకు రావద్దు. జనసమూహాలకు దూరంగా ఉండటం మంచిది. కేసులు పెరుగుతున్నందున భౌతిక దూరం పాటించాలి. అత్యవసరమైతే తప్పా దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు.