రంగారెడ్డి, జూలై 18, (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. ధాన్యం కొనుగోళ్ల సేకరణ మొదలుకొని ఎఫ్సీఐ వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం చేతులెత్తేసినప్పటికీ తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వానకాలం, యాసంగిల్లోనూ కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచి చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరించారు. సకాలంలోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా చెల్లింపులను జమ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేసిన రైతుల నిమిత్తం ఇంత చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎఫ్సీఐ ధాన్యాన్ని తీసుకోవడంలో జాప్యం చేస్తూ వస్తున్నది. ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు ధాన్యం సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు, మరోవైపు రైస్మిల్లర్ల నుంచి ఎఫ్సీఐ ధాన్యం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్నా పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎఫ్సీఐ జాప్యంతో సీఎంఆర్ రైస్ కూడా మిల్లర్ల నుంచి రాకపోవడంతో రేషన్ బియ్యానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుతో ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుండడం బాధాకరం.
ఎఫ్సీఐ జాప్యంతో రూ.5.76 కోట్ల నష్టం..
జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఇంకా రైస్ మిల్లర్ల వద్దనే మగ్గుతున్నది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపిస్తున్నప్పటికీ ఎఫ్సీఐ మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకున్న రైస్ మిల్లర్లు చేసేదేమీ లేక ఎఫ్సీఐ ఎప్పుడు సేకరిస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఎఫ్సీఐ సేకరించకపోవడంతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29,400 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లుల్లోనే ఉన్నది. వానకాలం సీజన్ నుంచి ధాన్యం ఇంకా పెండింగ్లో ఉన్నది. వానకాలం సీజన్కుగాను 7400 మెట్రిక్ టన్నులు, యాసంగి సీజన్కు సంబంధించి 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైస్ మిల్లుల్లోనే ఉన్నది.
ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలుమార్లు ఎఫ్సీఐ అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఎఫ్సీఐ నిర్లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5.76 కోట్ల నష్టం జరిగిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కొన్ని రైస్మిల్లుల్లో వర్షపు నీరు చేరి ధాన్యం మొలకెత్తుతున్నది. పలు రైస్మిల్లుల్లో గత వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం ఇంకా నిల్వ ఉండడంతో రైస్ మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సీజన్కుగాను జిల్లావ్యాప్తంగా 40 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,738 మంది రైతుల నుంచి 22,350 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. సేకరించిన ధాన్యానికిగాను రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.4.3.86 కోట్లను జమ చేసింది.
తెలంగాణ రైతాంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. రాష్ట్ర సర్కారు వడ్లను కొంటే, కేంద్ర సర్కార్ మొలకలెత్తేదాక చూసింది. తెలంగాణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి సవతితల్లి ప్రేమను చూపించడం మంచిదికాదు.