పరిగి, జూలై 15: గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. గొర్రెల సంపద పెంపునకు, గొర్రె పిల్లల రక్షణ కోసం నీలినాలుక వ్యాక్సిన్ను వేయాలని నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో ఈనెల 18 నుంచి 27వతేదీ వరకు గొర్రె పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో 2,45, 530 గొర్రెలుండగా వాటిలో కొదుమలు 69,850 ఉన్నాయి. ఐదు నెలల నుంచి ఏడాది లోపు ఉన్న గొర్రె పిల్లలను కొదుమలుగా పేర్కొంటారు. వీటికి ఉచితంగా టీకాలు వేయనున్నారు.
జిల్లాలో 69,850 గొర్రె పిల్లలు..
జిల్లాలోని 69,850 కొదుమ పిల్లలకు ఈ నెల 18వ తేదీ నుంచి అధికారులు టీకాలు వేయనున్నారు. బంట్వారంలో 493 గొర్రె పిల్లలు, బషీరాబాద్లో 3,499, బొంరాస్పేటలో 5,649, ధారూరులో 2,455, దోమలో 7,483, దౌల్తాబాద్లో 12,074, కొడంగల్లో 4,110, కోట్పల్లిలో 917, కులకచర్లలో 4,994, చౌడాపూర్లో 3,627, మర్పల్లిలో 1,200, మోమిన్పేటలో 2,480, నవాబుపేటలో 1,601, పరిగిలో 4,742, పెద్దేముల్లో 1,972, పూడూరులో 3,843, తాండూరులో 4,028, వికారాబాద్లో 1,316, యాలాల మండలంలోని 3,369 గొర్రె పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నారు.
గొర్రె పిల్లలకే నీలి నాలుక వ్యాధి..
నీలి నాలుక వ్యాధి గొర్రె పిల్లలకే వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె పిల్లల్లో 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. పెదవులు ఎర్రబడడం, నాలుక వాపు రావడం, రంగు మారడం, నోటిలో కురుపులు, సొల్లు కార్చడం, మేత తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధితో గిట్టల మధ్య ఎర్రబడి సరిగ్గా నడవలేవు. వ్యాధి తీవ్రతను బట్టి 5 నుంచి 6 రోజలు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోతాయి. ఈ వ్యాధిబారిన పడిన గొ ర్రెలకు ప్రతిరోజూ తైద, మొక్కజొన్న అంబలి తాగిస్తుండాలి. నోటిలోని పుండ్లను పొటాషియం ద్రావణంతో కడిగి బోరిక్ పౌడర్ను నోటిలో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, లోరాజెన్ వంటి లోషన్ను రాయాలి.
సిద్ధంగా 77,600 డోసులు
నీలినాలుక వ్యాధి నివారణ కోసం గొర్రె పిల్లలకు పంపిణీ చేసేందుకు 77,600 డోసుల టీకాలు ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. సుమారు రూ.6.02 లక్షలు ఖర్చు చేసి ఈ టీకాలను కొనుగోలు చేశా రు. వీటిని జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామా లవారీగా ఉన్నటువంటి గొర్రె పిల్లలకు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 54 ప్రత్యేక బృందాల ద్వారా ఈ టీకాలు వేసే కార్యక్రమం ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రతి మండలంలోని గ్రామాల్లో నిర్ణయించిన తేదీల్లో ప్రత్యేక బృందాలు వచ్చి గొర్రె పిల్లలకు నీలి నాలు క వ్యాధి నివారణ టీకాలను వేయనున్నారు.
ఇప్పటివరకు గొర్రెల పెంపకందారులే ఈ టీకాలను సొంత డబ్బులతో కొనుగోలు చేసి వేయించేవారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రభుత్వం ఉచితంగా నీలినాలుక వ్యాధి నివారణ టీకాలను వేయాలని నిర్ణయించడంతో జిల్లాలోని గొర్రెల పెంపకందారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవై పు మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం ఉచితంగా గొర్రె పిల్లలు పంపిణీ చేస్తూ జీవాల సం పద వృద్ధికి కృషి చేస్తూ.. మరోవైపు గొర్రె పిల్లలకు వచ్చే వ్యాధి నుంచి రక్షణకు సంబంధించిన టీకాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా జీవాల వృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నది.
18 నుంచి టీకాల పంపిణీ
జిల్లాలో ఈనెల 18 నుంచి 27 వతేదీ వరకు గొర్రె పిల్లల(కొదుమలు)కు నీలినాలుక వ్యాధి నివారణ టీకాలను పంపిణీ చేయను న్నాం. జిల్లాలో మొత్తం 2,45,530 గొర్రెలు ఉం డగా వాటిలో 69,850 కొదుమలు ఉన్నాయి. వాటికి టీకాలను వేసేందుకు 77, 600 డోసులు సిద్ధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 54 ప్రత్యేక బృందాలతో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.
–డాక్టర్ అనిల్కుమార్, వికారాబాద్ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి