పలుమార్లు చమురు, వంటగ్యాస్ ధరలను పెంచి పేదలపై ఎనలేని భారం మోపిన కేంద్రం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరను పెంచింది. బుధవారం డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.50 పెంచగా.. రూ.1105లకు చేరింది. ఇదివరకే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ప్రభావంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో సామన్యులు ఏమీ కొనలేని పరిస్థితి నెలకొన్నది. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర సర్కార్ పేదలను దోచి పెద్దలకు పెడుతున్నదని మండిపడుతున్నారు.
-ఇబ్రహీంపట్నం, జూలై 6
పరిగి/ఇబ్రహీంపట్నం, జూలై 6 : కేంద్ర ప్రభుత్వం పేదలు ఉపయోగించే గృహావసరాల వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచి మరోసారి పేదలపై భారం మోపింది. పల్లెలు మొదలుకొని ప్రతి ఇంట్లో వంట గ్యాస్ వాడకంతో కట్టెల పొయ్యిలు వాడడం నిలిచిపోయింది. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో నిత్యావసర సరుకులతోపాటు వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ పోతుండడం ద్వారా ఏదీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. గత మార్చి నెల వరకు వెయ్యి లోపు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెంచడం ద్వారా వెయ్యి రూపాయలు దాటింది. మరోసారి రూ.50 పెంచారు. తాజాగా బుధవారం రూ.50 పెంచింది. దీంతో హైదరాబాద్లో రూ.1055 నుంచి రూ.1105కు చేరుకోగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈ ధర మరింత పెరుగనుంది.
వికారాబాద్ జిల్లా పరిధిలో 1,84,466 గ్యాస్ కనెక్షన్లు
వికారాబాద్ జిల్లా పరిధిలో 1,84,466 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో రెగ్యులర్ 89260, దీపం కింద 35,193, సీఎస్ఆర్ కింద 21,260, ఉజ్వల్ కింద 38,753 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లా పరిధిలోని పరిగిలో 2019 మార్చిలో రూ.765.50 ఉండగా పెంచిన ధరతో రూ.1,113.50 వరకు చేరుకుంది. ఈ లెక్కన మూడేండ్లలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.348 పెరిగింది.
రవాణా ఖర్చు పెరుగుతున్న కొలదీ వంటగ్యాస్ ధర సైతం మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. వంటగ్యాస్పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను తరచుగా పెంచుతున్నదని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో కట్టెలతో వంట చేసేవారు. పొగ వల్ల ఇబ్బందులు, కట్టెల కోసం చెట్ల నరికివేతను పూర్తిగా అరికట్టడంతోపాటు సబ్సిడీపై గ్యాస్ ఇస్తామంటూ కేంద్రం పెద్దఎత్తున వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. దీంతో పేదవారు సైతం గ్యాస్ స్టౌలపైనే వంట చేస్తున్నారు. వివిధ పథకాల కింద విరివిగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంతో ప్రతి ఇంట్లోనూ గ్యాస్ కనెక్షన్ ఉన్నది. అయిదారు మంది ఉండే ఇంట్లో గ్యాస్ నెల రోజులకు సరిపడుతుంది.
జిల్లావ్యాప్తంగా నెలకు సుమారు 50,000 సిలిండర్లు రీ ఫిల్లింగ్ చేయిస్తారు. దీంతో ఒక్కో సిలిండర్పై రూ.50 పెంపుతో జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులపై నెలకు సుమారు రూ.25లక్షలు అదనపు భారం పడనుంది. దీంతో కట్టెల పొయ్యే దిక్కని మహిళలు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మళ్లీ అటవీ ప్రాంతాలకు కట్టెల కోసం పయనమవుతున్నారు. పెంచిన ధరలు తగ్గించి పేదలకు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
మోయలేని భారం
– అమృత, గృహిణి, వడిచెర్ల, బొంరాస్పేట మండలం
వంట గ్యాస్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. పెరిగిన ధరలు పేదలకు మోయలేని భారంగా మారాయి. కట్టెల పొయ్యిల వల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్యాస్ పొయ్యిలు కొనుక్కున్నాం. ఇప్పుడేమో ధరలు బాగా పెరుగుతున్నాయి. ధరలను తగ్గించాలి.
సిలిండర్ ధరను తగ్గించాలి
– మాణెమ్మ, నాగిరెడ్డిపల్లి, బొంరాస్పేట మండలం
ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్రం పెంచుతూ పోతున్నది. గతంలో సిలిండర్ ధరలు తక్కువగా ఉన్నపుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు పెద్దమొత్తంలో ఎల్పీజీ కనెక్షన్లు తీసుకున్నారు. ఇప్పుడేమో కేంద్రం సిలిండర్ ధరలను పెంచుకుంటూ పోతున్నది. కూలీనాలీ చేసుకుని బతికే కష్ట జీవులు గ్యాస్ పొయ్యి అంటేనే భయపడుతున్నారు.
పెంచిన ధరలతో తీవ్ర ఇబ్బందులు
– శివరాల జ్యోతి, ఇబ్రహీంపట్నం
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ.. పేదోడి నడ్డి విరుస్తున్నది. ఇంత పెద్దఎత్తున గ్యాస్ ధరలు పెంచడంతో వంటింట్లోకి వెళ్లాలంటేనే భయమేస్తున్నది. 400 ఉన్న గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో పెంచుతూ పోవడం సిగ్గుచేటు.
పెంచుతూ పోతున్నారు
– హంసమ్మ, ఇబ్రహీంపట్నం
గ్యాస్ ధరలను నిత్యం పెంచుతూ బీజేపీ సర్కారు పేదలను ఇబ్బంది పెడుతున్నది. గ్యాస్ కొనాలంటేనే దుఃఖం వస్తున్నది. మళ్లీ కట్టెల పొయ్యిలే పెట్టుకుని వంటలు చేసుకునే పరిస్థితి దాపురించింది.
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి
– శకుంతల దేశ్పాండే, తాండూరు
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. మహిళల ఆగ్రహానికి గురికావడం తథ్యం. గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏన్డీఏ ప్రభుత్వం చీటికీమాటికీ ధరలు పెంచుతూ పోతున్నది. సామాన్య జనం బతకడం కష్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరువాలి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి.