పరిగి, జూలై 6 : వర్షాలు కురువడం కొంత ఆలస్యమైనా ఇటీవల ప్రతి రోజూ వర్షాలతో వికారాబాద్ జిల్లా పరిధిలో పంటల సాగు ఊపందుకుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో భాగంగా జూన్ నెలలోనే విత్తనాలు వేయడం ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాలు ఆలస్యంగా కురువడంతో జూన్ నెలాఖరు నుంచి విత్తనాలు వేసే పనులు ప్రారంభమయ్యాయి. జూలైలో తరచుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పటివరకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 1,79,350 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతాంగం పంటలు వేస్తున్నారు.
అధికంగా 1,09,087 ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాపరిధిలో వానకాలంలో 5,31,501 ఎకరాలు సాధారణ సాగు ఉండగా.. ఇప్పటివరకు 1,79,530 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా.. అందులో పత్తి పంటనే అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వానకాలంలో జిల్లాలో పత్తి సాధారణ సాగు 1,83,020 ఎకరాలకు 1,09,087 ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయడం పూర్తయింది. కందులు 1,55,389 ఎకరాలకు 47,218, మక్కజొన్న 59,716 ఎకరాలకు 14,526, జొన్న 8,216 ఎకరాలకు 259, పెసర 18,939 ఎకరాలకు 5,124, మినుములు 10,913 ఎకరాలకు 2,350, సోయాబీన్ 1,964 ఎకరాలకు 474, బెబ్బర్లు సాధారణ సాగుకు 1278 ఎకరాలకు 136 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ఈ వానకాలంలో వరి సాధారణ సాగు 53,864 ఎకరాలకు ఇప్పటివరకు కేవలం 2 ఎకరాల్లోనే సాగు జరిగింది. ఈ నెల 15 వరకు సాధారణ సాగులో 90 శాతం పంటలు సాగు చేయడం పూర్తవనున్నాయి.
జిల్లావ్యాప్తంగా రైతులు విత్తనాలు వేయడంలో బిజీబిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు లోపు కందులు, పెసర పంటల సాగు పూర్తవనుండగా వరి నాట్లు ఆగస్టు 15 వరకు పూర్తవనున్నాయి. మరోవైపు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం రైతుబంధు కింద ఈ వానకాలానికి జిల్లాలో 2,70,232 మంది రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.319,36,64,616 మంజూరవగా ఇప్పటివరకు 2,39,928 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.266,85,79, 849 జమ చేశారు. దీంతోపాటు వానకాలంలో 74,547 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనాలు తయారు చేయడంతోపాటు అందుబాటులో ఉంచారు. యూరియా 31,902 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11,884, ఎంవోపీ 5,969, కాంప్లెక్స్ ఎరువులు 17,901, ఎస్ఎస్పి 6,891 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా సంబంధిత నెలల్లో అవసరమైన మేరకు ఎరువులు తెప్పించనున్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా బఫర్ స్టాకులు ఏర్పాటు చేయించేందుకు సైతం అధికారులు నిర్ణయించారు. జిల్లాలో అత్యధికంగా ఎరువుల అవసరం గల ప్రాంతాల్లో ఈ బఫర్ స్టాకులు ఏర్పాటు చేయనున్నారు.
వర్షాలతో విత్తనాలు వేసే పనిలో రైతాంగం
వర్షాలు ప్రతి రోజూ కురుస్తుండడంతో జిల్లావ్యాప్తంగా రైతాంగం విత్తనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్ నెలలో వికారాబాద్ జిల్లా పరిధిలో సాధారణ వర్షపాతం 93.8 మి.మీ ఉండగా 61.3 మి.మీ నమోదైంది. దీంతో జూన్లో పెద్దగా పంటల సాగు జడుగలేదు. జూలై నెలలో 6 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 29.7 మి.మీ ఉండగా.. ఇప్పటివరకు సరాసరి జిల్లాలో 56.9 మి.మీ వర్షపాతం నమోదైంది. పరిగి, మర్పల్లి రెండు మండలాలు మినహా 17 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదైంది.
జిల్లాలో 1,79,350 ఎకరాల్లో పంటల సాగు : గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేయగా ఇప్పటివరకు 1,79,350 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పంటల సాగు రోజు రోజుకూ పెరుగుతున్నది. ఈ నెల 15లోగా 90 శాతం పంటల సాగు పూర్తవుతుంది. పంటలు వేసేందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం.