కొత్తూరు రూరల్, జూలై 5: ప్రమాదవశాత్తు కాలు జారి క్వారీ గుంతలో పడిపోయిన బాలుడు చందు(16) రెండు రోజులైనా దొరకలేదు. సోమవారం బాలుడి మామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులతోపాటు ఫైర్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి బాలుడి కోసం వెతుకులాటను ప్రారంభించారు. రెండు రోజులుగా వెతుకుతున్నప్పటికీ బాలుడి ఆచూకీ కానరాలేదు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మంగళవారం సంఘటనా స్థలాన్ని షాద్నగర్ ఆర్డీవో రాజేశ్వరి, కొత్తూరు తహసీల్దార్ రాములు పరిశీలించారు. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఫైర్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆదేశించారు.
క్వారీని మూసేయాలని గ్రామస్తుల ఆందోళన
ఇన్ని రోజులుగా ఎన్నో మూగ జీవాల ప్రాణాలు, నేడు మనిషి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న క్వారీ గుంతను అధికారులు మూసివేయాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ఆవులు, బర్రెలు, గొర్రెలు గుంతలో పడి మృత్యువాతకు గురయ్యాయన్నారు. ఇంతటి ఆస్తి, ప్రాణ నష్టాలకు కారణమవుతూ నిర్లక్ష్యాన్ని వహించిన క్వారీ యజమానులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసులు, అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.