ఇబ్రహీంపట్నం, జూలై 4 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భూగర్భజల మట్టం పెరుగడంతో బోరుబావుల్లోనూ నీటిమట్టం పెరిగింది. ఈసారి సాగునీటికి కొదువలేకపోవడంతో రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ వద్ద నిర్మించిన చెక్డ్యాం పూర్తిగా నిండింది. తట్టిఖానా చెక్డ్యాం నిండుకుండను తలపిస్తున్నది. ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరందించే పెద్దవాగుపై నిర్మించిన పలు చెక్డ్యాంలు పూర్తిస్థాయిలో నిండాయి. రాచకాల్వలో పోచారం, ఆదిబట్ల, ఉప్పరిగూడ తదితర ప్రాంతాల్లో నిర్మించిన చెక్డ్యాంలూ నిండాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దవాగు, రాచకాల్వల నుంచి ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరు చేరడంతో పెద్ద చెరువులో నీటిమట్టం పెరిగింది.
రెండు రోజుల కింద రెండులక్షల చేపపిల్లలను కూడా మత్స్యకారులు వదిలారు. పెద్దచెరువు ఆయకట్టు బోరుబావుల కింద సాగు విస్తీర్ణం పెరిగింది. ఇబ్రహీంపట్నం, రాందాస్పల్లి, ఉప్పరిగూడ, కర్ణంగూడ తదితర గ్రామాల్లోనూ భూగర్భజల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దీంతో అన్నదాతలు రెట్టింపు ఉత్సాహంతో వరితో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను సాగు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురువడం, రైతుబంధు సాయం అందడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగనున్న సాగు విస్తీర్ణం..
ఇబ్రహీంపట్నం డివిజన్లో గణనీయంగా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశమున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. డివిజన్ పరిధిలో సుమారు 25వేల ఎకరాల్లో వరిసాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. 70వేల ఎకరాల్లో పత్తి, 10వేల ఎకరాల్లో కంది పంటలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నాట్లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు..
అదునుకు వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనున్నది. రైతులకు కావాల్సిన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఆయా ఫర్టిలైజర్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచాం. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అధిక దిగుబడులు వచ్చే పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నాం.
– సత్యనారాయణ, ఏడీఏ వ్యవసాయశాఖ